అసెంబ్లీలో జగదీష్ రెడ్డి వ్యాఖ్యకు కెసిఆర్ విచారం
హైదరాబాద్: శాసనసభలో జరిగిన దానికి తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. కాంగ్రెసు సభ్యుడు చిన్నారెడ్డి చెప్పిన మాటలు పూర్తిగా వాస్తవమని, చిన్నారెడ్డి చెప్పినట్లు మహబూబ్నగర్ జిల్లా నిజంగా వెనకబడిందేనని, చిన్నారెడ్డి అడిగిన ప్రశ్నలో తప్పు లేదని ఆయన అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అనేక విద్యుత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, త్వరలోనే పూర్తవుతాయని కెసిఆర్ చెప్పారు. ఉద్యమంలో పలువురు కాంగ్రెసు నాయకులు జైలుకు వెళ్లారని ఆయన గుర్తు చేశారు.
అంతకు ముందు సిఎల్పీ నేత కె. జానా రెడ్డి చేసిన సూచనలకు కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. సభకు వచ్చి అసెంబ్లీ కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. సభలో జరగకూడని కొన్ని ఘటనలు జరిగాయని, మంత్రిగా ఉన్నవారు అలాంటి పదజాలం వాడకూడదని, సభను బాగా నిర్వహించుకుంటున్నామని బయట అందరు చెప్పుకుంటున్నారని కెసిఆర్ అన్నారు.
శాసనసభలో అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ సభ మనందరిదని, పాత్రలు వేర్వేరు అయినా అందరం ఒకే లక్ష్యం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. సభలో ఏ ఒక్కరిని చులకన చేసి మాట్లాడటం సరికాదని ఇరుపక్షాలకు సీఎం సూచించారు. ఒక వేళ ప్రతిపక్షాలు ఏదైనా ఆవేశంతో మాట్లాడినా మంత్రులుగా దాన్ని సరైన పద్దతిలో తిప్పికొట్టాలిగాని ఆవేశాలకు వెళ్లకూడదని హితవు పలికారు.
మంత్రి కూడా సభలో కొంచెం కటువుగా మాట్లాడిన విషయం నిజమేనని, అలాంటి పదాలు సభలో మాట్లాడకూడదని గుర్తు చేశారు. అయితే చిన్నారెడ్డి మాట్లాడినప్పుడు మైక్ కట్ అయిందని, మంత్రి జగదీష్రెడ్డి మాట్లాడినప్పుడు మైక్ ఆన్లో ఉందని, ఇద్దరి తరపున సభలో తాను విచారం వ్యక్తం చేస్తున్నాని సీఎం సభకు తెలిపారు.
ఇక నుంచి దూషణలకు పోకుండా సభా సంప్రదాయాలను కాపాడుకుందామని, కొత్త రాష్ట్రమైనా తెలంగాణ శాసనసభ సంప్రదాయాలు కాపాడుకుంటుందన్న విలువలను నెలకొల్పేందుకు కృషి చేద్దామని అన్నారు. వ్యక్తిగత విమర్శలకు తావు ఇవ్వకపోవడమే మంచిదని, ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి సూచనలను తప్పకుండా స్వీకరిస్తామని అన్నారు. జానారెడ్డి మాటలతో వంద శాతం ఏకీభవిస్తున్నానని, నువ్వెంత.. నేనేంత అనుకుంటూ పోతే దానికి అంతూపొంతూ ఉండదని అన్నారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మించతలపెట్టిన థర్మల్ పవర్ప్లాంట్కు నేడు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతిని తెలపనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. శాసనసభలో మహబూబ్నగర్లో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మంత్రి జగదీష్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిల మధ్య జరిగిన సంవాదంపై సీఎం స్పందించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు అనేక విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, ఈ క్రమంలో భాగంగానే నల్లగొండ జిల్లా దామరచర్లలో 6,800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు చేపట్టామని అన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు విద్యుత్కేంద్రం నుంచి విడుదలైయ్యే నీరు, అదేవిధంగా మూసీ నది నుంచి ప్రవహించే నీరు సంవత్సరం పొడవునా ఎల్లప్పూడు దామరచర్ల మండలంలో అందుబాటులో ఉంటుందని అన్నారు. అంతేకాకుండా అటవీ భూముల లభ్యత ఎక్కువగా ఉందని, వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని నల్లగొండ జిల్లాలో విద్యుత్ ప్రాజెక్టును నిర్మించతలపెట్టామని అన్నారు.