బక్కగున్నా, బొండిగె పిసికేత్తే పోతడనుకున్నరు: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. నిజామాబాద్ జిల్లా జుక్కల్ తెలుగుదేశం ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆదివారం తెరాసలో చేరారు. ఈ సందర్బంగా తెలంగాణ భవన్లో కెసిఆర్ ప్రసంగించారు. "కేసీఆర్ బక్కగున్నడు..ఏడన్నా బొండిగ పిసికేత్తే పోతడనుకున్నరు. కానీ బక్కగా ఉన్న కేసీఆర్కు తోడుగా పోచారం శ్రీనివాస్రెడ్డి, హనుమంత్ షిండే వంటి తెలంగాణ భీములు గదలు పట్టుకొని బయలుదేరారు. ఉద్యమానికి ఢోకాలేదు'' అని వ్యాఖ్యానించారు.
ఇష్టం లేనివారిని విడదీసే చట్టాలు మాత్రమే ఉన్నాయని, కలిసి ఉండాల్సిందేననే చట్టాలు ఎక్కడా లేవని ఆయన అన్నారు. "మేం ఆంధ్రా వాళ్ల సొమ్ము అడుగుతున్నామా? గుంటూరులో గుంట భూమి కావాలన్నామా? వాళ్లకు ఇచ్చే నీళ్లు ఇవ్వాలంటున్నామా? మేం అధికారం, ఆస్తి కోసం కొట్లాడటంలేదు. కానీ ఆంధ్రా వాళ్లు మాత్రం..'మాది మాకే కావాలి. మీది కూడా మాకే కావాలి' అని అంటున్నారు.
కలిసి ఉందామనేవారు అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తమకు ఏం కావాలో చెప్పకుండా సీమాంధ్ర నాయకులు అర్థం లేని మాటలు చెబుతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం జుక్కల్ ఎమ్మెల్యే షిండే వెంట పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లోకి వచ్చారంటే, ఆ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. తెలుగుదేశం తెలంగాణ నేతలంతా షిండే బాటలో ఉద్యమంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండదని, మాయం కాక తప్పదని ఆయన అన్నారు. బీహార్లో ఒక్కప్పుడు లాలూప్రసాద్ పార్టీ బలంగా ఉండేదని, బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం విడిపోయాక ఆ ప్రాంతంలో లాలూ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని ఆయన ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అదే అవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ మొత్తం ఆంధ్రా పాలనలో అడుగంటిపోయిందని, పెరిగిన కరెంట్ బిల్లుల కారణంగా చంద్రబాబు హయాంలో 10 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కెసిఆర్ అన్నారు.
తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఆయన చర్యలు తనను, కార్యకర్తలను తీవ్రంగా బాధించాయని ఎమ్మెల్యే హనుమంత్ షిండే చెప్పారు. తెలంగాణ ప్రకటన వచ్చాక మీడియా సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలు, ఆయన హావభావాల వల్ల తనతో పాటు ప్రతి కార్యకర్త గుండె రగిలిందని షిండే అన్నారు.