వాస్తు మార్పు: భేటీకి కెసిఆర్, చంద్రబాబు కసరత్తు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు వాస్తుపై తనకున్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయానికి మార్పులు చేసిన ఆయన.. ఇప్పుడు అసెంబ్లీలో వాస్తు మార్పులపై చర్చలు జరుపుతున్నారు. శనివారం స్పీకర్ మధుసూదనాచారితో వాస్తు మార్పులపై కెసిఆర్ చర్చించారు.
సీటింగ్ విధానంపై స్పీకర్ మధుసూదనాచారితో కెసిఆర్ చర్చించినట్లు సమాచారం. అయితే బడ్జెట్ ప్రక్రియ అనంతరం మార్పులు చేట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. కెసిఆర్ ఏ ముఖ్యమైన పని చేయాలన్నా.. ముహూర్తం, వాస్తు చూసుకున్న తర్వాతే మొదలుపెడతారనే విషయం తెలిసిందే.
కాగా, సెప్టెంబర్ రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్ 10న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శాసనసభలో సీట్ల సంఖ్య కుదించాలని ఈ సందర్భంగా కెసిఆర్ అధికారులకు సూచించారు. అసెంబ్లీలో మరమ్మతులు ఖర్చు భరించే విషయంపైనా చర్చ జరిపారు. భవనాల మరమ్మతు ఆయా రాష్ట్రాలే భరించాలని, ఉమ్మడి ఆస్తుల మరమ్మతు ఖర్చు 58:42 నిష్పత్తిలో భరించాలని ప్రతిపాదించనున్నారు.
మరోవైపు అసెంబ్లీలో పూర్తి అంశాలపై సిద్ధం కావాలని కెసిఆర్ ఆదేశించారు. అలాగే మెదక్ లోకసభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన నేపథ్యంలో దానిపై కూడా చర్చలు జరిగినట్లు తెలిసింది. ఇద్దరు అభ్యర్థులను కెసిఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
స్పీకర్, ఉన్నతాధికారులు చంద్రబాబు భేటీ
అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, ఇతర ఉన్నతాధికారులతో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఆదివారం ఇరు(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాల భేటీ దృష్ట్యా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఛాంబర్ల కేటాయింపుపై చర్చించారు.