దారికి తెచ్చుకునే ప్రయత్నం: కెసిఆర్ వన్మ్యాన్ షో
హైదరాబాద్: ఈ నెల 9న సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరు రోజులపాటు జరిగాయి. కొత్త రాష్ట్రం.. కొత్త సభ కావటంతో శాసనసభలో మొదటి రెండు రోజుల్లో ప్రొటెం స్పీకర్, సభ్యుల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక వంటి రాజ్యాంగపరమైన ప్రక్రియను చేపట్టారు. మూడవ రోజు బుధవారం తెలంగాణ ఉభయ సభలను (శాసనసభ, మండలి) ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. తెరాస ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు.
నాల్గవ రోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ మొదలైంది. సాధారణంగా కొత్త సర్కారు కొలువుదీరాక అసెంబ్లీ మొదటి సమావేశాల్లో ప్రభుత్వాన్ని విమర్శించటానికి విపక్షాలు వెనుకాముందు ఆలోచిస్తాయి. కానీ రైతులకు రుణ మాఫీ విషయంలో స్పష్టత కోరుతూ, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్షాలు ముఖ్యమంత్రి కెసిఆర్పై, ఆయన ప్రభుత్వంపై విమర్శలకు వెనుకాడలేదు.
పోలవరం ముంపు గ్రామాల వ్యవహారంపైనా ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాయి. ఇదే సమయంలో కెసిఆర్ కూడా తన వాగ్ధాటితో విపక్షాలను మొదటి సమావేశాల్లోనే తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. విపక్షాలకు చెందిన ముఖ్య నేతల పేర్లను పదే పదే పలుకుతూ... కీలకమైన అన్ని విషయాల్లోనూ విపక్షాలను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి తుది నిర్ణయానికి వస్తామని చెప్పటం ద్వారా వారిని ఆకట్టుకోవటానికి యత్నించారు.
ఆరు రోజుల శాసన సభ సమావేశాల్లో కెసిఆర్ వన్మాన్ ఆర్మీ చూపించారు. కెసిఆర్ను ఇంత కాలం ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకునిగానే చూసిన వారికి శాసనసభా నాయకునిగా తన నాయకత్వ సామర్ధ్యాన్ని చూపించారు. విషయ పరిజ్ఞానంలో గత ముఖ్యమంత్రులకు ఏమాత్రం తగ్గకుండా అంకెలతో ఆడుకున్నారు. ఆరు రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో సభా నాయకుడిగా కెసిఆర్ తన సామర్ధ్యం ప్రదర్శించారు.
మజ్లిస్ సభ్యులు పాతబస్తీ గురించి ప్రశ్నిస్తే ఉర్దూలో వారికి సమాధానం చెప్పారు. ఖమ్మం జిల్లా సభ్యులు ముంపు మండలాల గురించి ప్రశ్నిస్తే సమగ్ర సమాచారంతో సమాధానం చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుల గురించి, హైదరాబాద్ సమస్యల గురించి అప్పటికప్పుడు ఎవరే అంశం గురించి ప్రస్తావించినా, అధికారుల సహకారం కూడా తీసుకోకుండానే గడగడ అంకెలతో పాటు సమాధానం చెప్పారు.
మధ్యలో పిట్ట బెదిరింపులకు బెదిరేది లేదు... ఇదేమన్నా చందూలాల్ దర్బారా అంటూ తెలంగాణ నానుడులతో చమత్కరించారు. అంకెలు, లెక్కలు, ప్రాజెక్టులు, సామెతలు, చరిత్ర, సాహిత్యం, రాజకీయం ఇలా జోరు చూపించారు. సభలో సందర్భం వచ్చినప్పుడు తెలంగాణకు సంబంధించిన చరిత్రను, గత పాలకుల పని తీరును చెప్పారు. కాగా, మధుసూదనాచారి సభలోని అన్ని పక్షాల మద్దతుతో స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, డిప్యూటీ స్పీకర్ పదవి కావాలంటూ విపక్షాల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ, వారిని ఒప్పించి ఈ పదవికి తమ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికోవడంలో కెసిఆర్ సఫలమయ్యారు.