చేజింగ్ సెల్ ఏర్పాటు: కెసిఆర్ నోటా సింగపూర్ మాట
హైదరాబాద్: సింగపూర్లాంటి దేశాలను అధ్యయనం చేసిన తర్వాత కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. ప్రపంచంలో ఉన్నతమైన పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్న దేశాలకు వెళ్లి అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం పారిశ్రామిక విధానం రూపకల్పనపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు ప్రోత్సాహకరంగా సింగిల్ విండో విధానం ఉండాలని, దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా సులభతరంగా, సరళంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా నూతన విధానం ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే దరఖాస్తులను పరిశీలించి రెండువారాల్లో అన్ని అనుమతులు మంజూరు చేసేలా నూతన విధానం ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు.
కొత్త పరిశ్రమల స్థాపనకు వచ్చేవారిని, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారి కోసం సిఎం కార్యాలయంలోనే ‘చేజింగ్ సెల్' ఏర్పాటు చేస్తామని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ప్రస్తుతం విధానం ప్రకారం 17 శాఖల నుంచి 22 అనుమతులు పొందడం అనేది లోపభూయిష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ రకంగా కాకుండా పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ అధీనంలో ఉన్న భూమిని పారిశ్రామిక పార్క్గా మార్చి, వాటిలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అన్ని అనుమతులు ముందుగా పొందేలా నూతన విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
రాష్టవ్య్రాప్తంగా వ్యవసాయానికి ఉపయోగపడని భూములను టిఎస్ఐఐసికి కేటాయించి, ఏ పరిశ్రమకు ఎంత భూమి అవసరమో, ఎక్కడ కేటాయించాలనేది ఆ సంస్థనే నిర్ణయం తీసుకునేలా విధానం ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి కనీసం 10 శాతం నీటిని పరిశ్రమల అవసరాలకు కేటాయించే విధంగా చట్టం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
పరిశ్రమలన్ని ఒకేచోట కేంద్రీకృతం కాకుండా రాష్టవ్య్రాప్తంగా స్థాపించేలా చూడాలన్నారు. ఒకచోట ఫార్మాసిటీ, మరోచోట టెక్స్టైల్ పార్క్, ఇంకోచోట పెయింటింగ్ పరిశ్రమ ఇలా ఒక్కోటి ఒక్కోచోట ఉండాలని, దీనివల్ల అన్ని ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు ఉంటాయని సూచించారు. నూతన పారిశ్రామిక విధానానికి తుదిరూపం ఇచ్చే ముందు ఫిక్కి, ఫ్యాప్సీ, ఐఐసి వంటి సంస్థల ప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరమైన వరంగల్ను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు. దక్షిణ భారత దేశంలోనే పత్తి పంట వరంగల్ జిల్లాలో పండుతుందని, అక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరంగల్లో ఆజాంజాహి మిల్లుకు చెందిన కొంతభూమి అందుబాటులో ఉందని, దానికితోడుగా మరికొంత భూమి సేకరించి తమిళనాడులోని తిర్పూర్ తరహాలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.
వరంగల్, ఖమ్మం సరిహద్దులో బయ్యారం, మహబూబాబాద్ ప్రాంతాల్లో విస్తరించిన ఇనుప ఖనిజ నిక్షేపాలను పూర్తిగా వినియోగించుకునేందుకు అక్కడే ఉక్కు పరిశ్రమ స్థాపిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దాదాపు రూ. 30వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ స్థాపించేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సంప్రదింపులు జరుపుతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. వరంగల్లో విమానాశ్రయం, రైలుమార్గంతో పాటు హైదరాబాద్ నుంచి గంటా పది నిమిషాల్లో చేరుకోవచ్చని, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారికి ఆ విషయాన్ని తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించారు.