మహిళలకు తీపికబురు.. రూ.110 కోట్లతో భవనాలు.. ప్రారంభం అప్పుడే!
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి, మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తోంది. మహిళలను కోటీశ్వరులను చెయ్యాలని సంకల్పించిన రేవంత్ సర్కార్ ఇప్పటికే స్వయం సహాయక సంఘాల మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోంది. ఇక తాజాగా మహిళా సాధికారతకు మరో ముఖ్యమైన అడుగు వేసింది.
జూన్ 2న ఇందిరా మహిళా శక్తి భవనాలు ప్రారంభం
రాష్ట్రంలోని 22 జిల్లాల్లో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాలు జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.. ఈ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు రూ.110 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి భవనం సుమారు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో నిర్మాణం అయ్యింది. ఒక్కో భవన నిర్మాణానికి దాదాపు రూ.5 కోట్లు ఖర్చు అయింది.

ఇందిరా మహిళా శక్తి భవనాల ఉపయోగం ఇందుకే
ఇప్పటికే 17 భవనాల నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన 5 జిల్లాల్లో పనులు చివరి దశలో ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పర్యవేక్షణలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈ పనులను వేగంగా పూర్తి చేస్తోంది. ఈ భవనాలలో మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) సమావేశాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు,ఉత్పత్తుల ప్రదర్శన & మార్కెటింగ్,
జిల్లా స్థాయి సెమినార్లు & కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
ఆర్థిక, సామాజిక అభివృద్ధికి స్థిరమైన వేదిక
ఇప్పటి వరకు సొంత భవనాలు లేక అద్దె ఇళ్లపై ఆధారపడుతున్న మహిళా సమాఖ్యలకు ఇది పెద్ద ఊరటనిస్తుంది. ఈ కేంద్రాలు మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి స్థిరమైన వేదికగా మారనున్నాయి. జూన్ 2న జరిగే సామూహిక ప్రారంభోత్సవం రాష్ట్ర మహిళా లోకానికి గొప్ప బహుమతిగా మారనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం దేశానికే మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందిర మహిళా శక్తి భవనాల ఏర్పాటు శుభవార్త
ఇప్పటికే ఎస్హెచ్ జీ మహిళలకు ప్రభుత్వం పెట్రోల్ బ్యాంకులు, బస్సులు, ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ లు, డ్రోన్లు, సోలార్ పవర్ ప్లాంట్లు ఇలా ఆర్ధిక స్వావలంబనకు అవకాశం ఇస్తున్న తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు వీరి కోసం ఇందిర మహిళా శక్తి భవనాలను సైతం ఏర్పాటు చేయటం శుభవార్త.













Click it and Unblock the Notifications