రాష్ట్రపతికి కెసిఆర్ లేఖ, స్టే వస్తే రాజకీయాల్లో: లగడపాటి
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు మంగళవారం ఓ లేఖను రాశారు. పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని ఆ లేఖలో కెసిఆర్ పేర్కొన్నారు.
రాష్ట్ర పునర్విభజన బిల్లులో లేనందున పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్ర ప్రాంతానికి కేటాయించడం సరికాదని కె చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రణబ్ ముఖర్జీని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.
విభజనపై సుప్రీం కోర్టు స్టే ఇస్తే రాజకీయాల్లోనే: లగడపాటి
రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టు స్టే ఇస్తే తాను రాజకీయాల్లో కొనసాగుతానని విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఒకవేళ రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టు స్టే ఇస్తే తనకు రాజకీయాల్లో కొనసాగేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపితే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని చెప్పిన లగడపాటి, బిల్లుకు ఆమోదం తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఎంపి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
సోనియాతో దిగ్విజయ్, అహ్మద్ పటేల్ భేటి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రెండు పిసిసిల ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర సమితి విలీనంపై చర్చించనున్నట్లు సమాచారం.