తిట్టకుండా ఉండగలవా?: కెసిఆర్కు ఏపిలో తోడుదొంగ దొరికాడన్న కెఈ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు రాజ్యాంగంపై అవగాహన లేదని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. నెలరోజులు ఆంధ్రావాళ్లను తిట్టకుండా ఉండగలవా? అంటూ కెసిఆర్ను నిలదీశారు.
ఆర్డీఎస్ ప్రాజెక్టులో ఆంధ్రా, కర్ణాటక భాగస్వాములని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి సీడబ్ల్యూసీ, ట్రైబ్యునల్ అనుమతి లేదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమని... దానికి ఎవరి అనుమతి అవసరం లేదని కేఈ స్పష్టం చేశారు.
ఏ అంశంలోనూ తమతో సంప్రదించకుండానే కెసిఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఎటువంటి భాష మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. కెసిఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సుంకేశులపై బాంబులు వేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఖండించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రాలో కేసీఆర్కు తోడు దొంగ దొరికాడని.. జగన్ను అడ్డుపెట్టుకుని కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, కేసీఆర్తో జగన్ కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. ఉమ్మడి రాజధానిలో ఆంధ్రావాళ్లను అవమానించకుండా చూడాలని గవర్నర్ నరసింహన్ను కోరనున్నట్లు ఆయన తెలిపారు.