చీటికి మాటికి దీక్షలేమిటి, మోడీని కలవండి: జగన్కు కెఈ సూచన
కర్నూలు/ న్యూఢిల్లీ/ నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దీక్షలు మానుకోవాలని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సూచించారు. దీక్షలు మాని ప్రధాని నరేంద్రమోడిని కలిసి హోదా గురించి మాట్లాడాలని ఆయన చెప్పారు.
వైయస్ జగన్ చీటికి మాటికి దీక్షలు చేయటం సబబు కాదని కేఈ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటామని కేఈ తెలిపారు. రైతులకు టీడీపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన అన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
ఇదిలావుంటే, ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గన్నవరం, భోగాపురం ఎయిర్పోర్టు, తదితర పెండింగ్ ప్రాజెక్టులపై చంద్రబాబుతో చర్చించినట్టు తెలిపారు.
త్వరలోనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్, డొమిస్టిక్ రంగాల్లో కొత్త సర్వీసుల ప్రతిపాదనలపై చర్చించామని అశోక్ గజపతిరాజు చెప్పారు.
వీరమణితో పల్లె భేటీ
తమిళనాడు మంత్రి వీరమణి ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కలిశారు. తమిళనాడులో తెలుగు బోధనపై ఆయన వీరమణితో చర్చించారు. 30న తమిళనాడు, ఏపీ విద్యాశాఖ అధికారుల సమావేశం జరపాలని ఈ భేటీలో నిర్ణయించారు. తమిళనాడులో తెలుగు విద్యా బోధనను నిషేధించడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పల్లె తమిళనాడు మంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.