కేశినేని నాని రాజీనామా వ్యవహారంలో కీలక పరిణామం..!!
ఏపీలో ఎన్నికల వేళ టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీకి బలమైన నియోజకవర్గంగా ఉన్న విజయవాడలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఎంపీ కేశినేని నాని రాజీనామా నిర్ణయం వేళ పార్టీ నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అటు చంద్రబాబు తిరువూరు సభకు హాజరయ్యారు. కేశినేని నానికి ఆహ్వానం పలికారు. ఈ సమయంలోనే కేశినేని నాని తన భవిష్యత్ నిర్ణయం ఏంటో స్పష్టం చేసారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ వీడటం ఖాయమైంది. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వటం లేదని స్వయంగా నాని వెల్లడించారు. తాను ఏ పార్టీలో చేరుతాననేది అనుచరులతో చర్చించిన తరువాత వెల్లడిస్తానని స్పష్టం చేసారు. ఇదే సమయంలో వైసీపీ నేతలతో నాని సన్నిహితంగా ఉంటున్నారు. నానితో వైసీపీ ముఖ్య నేతలు టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. అయితే, కేశినేని నాని వైసీపీలో చేరే అవకాశం ఉందా అనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. ఇటు నానితో రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ సమావేశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. పార్టీ ప్రతినిధిగా కనకమేడల శనివారం నానితో మంతనాలు సాగించినట్లు చెబుతున్నారు.

ఇటు తిరువూరు సభలో ఎంపీగా కేశినేని నానికి ప్రత్యేకంగా సీటు కేటాయించారు. కానీ, నాని హాజరు కాలేదు. దీనిపైన నాని స్పందించారు. తాను పార్టీనే వద్దనుకున్న తరువాత ఇక ప్రోటోకాల్ ఏంటని వ్యాఖ్యానించారు. తాను రాజీనామా చేయటం ఖాయమని..కేవలం సాంకేతికంగానే తన రాజీనామా జరగలేదని స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు తిరువూరు సభకు నాని గైర్హాజరయ్యారు. వచ్చే వారం లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తరువాత తన అనుచర వర్గంతో నాని సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి వేళ తన రాజకీయ భవిష్యత్ పైన నాని ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయన ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. అయితే, నాని వైసీపీ వైపు చూస్తారా..లేక స్వతంత్రంగా బరిలో నిలుస్తారా అనేది టీడీపీ ఆసక్తిగా గమనిస్తోంది.












Click it and Unblock the Notifications