భయపెడుతున్నారు: టిడిపిపై కన్నా, బిజేపీపై కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు
విజయవాడ: మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పైన టిడిపి నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆదివారం నాడు పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత అజెండాతో కొందరు స్వార్థ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. స్వార్థమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆలయాల సంరక్షణ తమ బాధ్యత అన్నారు. విగ్రహాల ధ్వంసం సరైంది కాదన్నారు. పుష్కరాల అభివృద్ధి కోసమే కొన్ని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామని చెప్పారు. గోశాలను ఇస్కాన్ ఆలయం తరహాలో తీర్చిదిద్దాలనేది చంద్రబాబు ఆకాంక్ష అని చెప్పారు. చారిత్రక ఆలయాలను పరిరక్షిస్తామన్నారు.
బీజేపీXటీడీపీ, టెన్షన్: ఇదీ బాబు ఆలోచన: బుద్ధా, గుళ్ల కూల్చివేతలో కొత్త కోణం!
దొంగ స్వాములను తీసుకు వచ్చి ప్రచారం చేస్తున్నారని బీజేపీ పైన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలు బురద జల్లుతున్నారని కన్నాను ఉద్దేశించి అన్నారు. బెజవాడలో అప్పులపాలై వెళ్లిన వారు వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నర్సాపురం ఎంపీ ఇక్కడకు వచ్చి మాట్లాడటం ఏమిటని, ఇక్కడ (బెజవాడ) ఉన్న తమకు తెలియదా అని ప్రశ్నించారు.
విజయవాడలో గుడుల కూల్చివేత ఘటన టిడిపి - బిజెపి నేతల మధ్య చిచ్చు పెట్టిన విషయం తెలిసిందే. ఆదివారం నాడు కన్నా లక్ష్మీనారాయణ, మరో బీజేపీ నేత సోము వీర్రాజులు కూల్చివేసిన గోశాల రహదారి వద్ద విస్తరణ పనులు, ఆలయ ప్రాంతాలను సందర్శించారు.
అనంతరం ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయగా, టిడిపి నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడి, వారికి అండగా ఉండాలని వచ్చిన తమను జనాలను తెచ్చి అడ్డుకోవాలని టిడిపి చూస్తోందన్నారు. ఈ తరహా చర్యలతో తమను భయపెట్టలేరని వ్యాఖ్యానించారు.
కొందరు స్థానిక నేతలు వచ్చి గొడవ చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యంతరకర భాషను వాడితే సహించేది లేదన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా సమస్యను పరిష్కరించాలన్నదే తమ అభిమతమన్నారు. బిజెపి నేతల ప్రెస్ మీట్, టిడిపి నేతలు అడ్డుకోవాలని చూసిన నేపథ్యంలో పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను సముదాయించారు.
అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ... అభివృద్ధి పేరుతో ప్రజల మనోభావాలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆలయాల కూల్చవేతలో హిందువుల సంప్రదాయాలను పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఘటనపై రేపు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.