పవన్ కళ్యాణ్కు షాక్: కేశినేని నానికి చంద్రబాబు బి ఫాం
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు స్థానంపై తెలుగుదేశం పార్టీలో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు మంగళవారం తెర పడింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం కేశినేని నానికి విజయవాడ లోకసభ పోటీకి సంబంధించి బి ఫాం అందజేశారు. కేశినేని నాని బుధవారం టిడిపి తరఫున లోకసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
విజయవాడ అభ్యర్థిత్వంపై చంద్రబాబు నాయుడు పైన తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్కు టిక్కెట్ ఇవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా ఇతర ప్రముఖ రాజకీయ పార్టీల నేతల నుండి ఒత్తిడి వచ్చినట్లుగా ఊహాగానాలు వచ్చాయి.

నాలుగు రోజులుగా తర్జన భర్జన పడుతున్న చంద్రబాబు చివరకు కేశినేని నానికే టిక్కెట్ కేటాయించి.. బి ఫాం ఇచ్చారు. పొట్లూరి కోసం పవన్ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. పొట్లూరికి టిక్కెట్ ఇచ్చే వరకు తాను టిడిపి అభ్యర్థులకు ప్రచారం చేయనని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది.
అయినప్పటికీ చంద్రబాబు కేశినేని నానికే టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, పొట్లూరి వర ప్రసాద్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కేవలం బిజెపి అభ్యర్థులకు మాత్రమే ప్రచారం చేసి తెలుగుదేశం వరకు మౌనంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
జగన్ పార్టీ అభ్యర్థులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం విడుదల చేసిన జాబితాలో బాపట్ల లోకసభతో పాటు మరో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం ప్రకటించింది. పాలకొల్లు నుండి మేకా శేషుబాబుకు, అచంట నుండి ప్రసాద రాజుకు టిక్కెట్ కేటాయించింది.












Click it and Unblock the Notifications