కలిసి ముందుకు: టీడీపీలో దేవినేని అవినాశ్కు కీలక పదవి? అందుకే
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత దేవినేని అవినాశ్కు టీడీపీలో కీలక పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందని ప్రచారం సాగుతోంది. ఆయనకు రాష్ట్ర స్థాయిలో మంచి పదవి ఇవ్వడంతో పాటు జిల్లా స్థాయిలో సేవలను మరింతగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని అంటున్నారు.
లేదంటూనే చురక, అఖిల నుంచి భూమా నాగిరెడ్డి దాకా: పవన్ ఆసక్తికర విషయాలు
ఈ మేరకు ప్రచారం సాగడంతో పాటు జిల్లా నేతలు కూడా మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు చెబుతున్నారు. ఈ మేరకు వార్తలు కూడా వస్తున్నాయి. దేవినేని నెహ్రూ టీడీపీలో చేరినప్పుడు తన కొడుకు భవిష్యత్తు కోసమే చేరుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
టీడీపీలో క్రియాశీలకంగా దేవినేని అవినాశ్
దేవినేని నెహ్రూ మృతి అనంతరం ఆయన వారసుడిగా అవినాశ్ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నెహ్రూ తర్వాత కేడర్ చెదిరిపోకుండా చూశారు. టీడీపీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమంలో అవినాశ్ క్రియాశీలకంగా ఉంటున్నారు. ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు.
అవినాశ్ చూపించిన వారికి పెద్దపీట
జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో కలిసిమెలిసి పాదయాత్రలు నిర్వహించారు. అవినాశ్ అర్బన్ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. నెహ్రూ బలగం, అవినాశ్ నైపుణ్యత చూసిన టీడీపీ పెద్దలు ఆయన సూచించిన వారికి అర్బన్ కమిటీలో కూడా పెద్ద పీట వేశారని చెబుతున్నారు.
ఉపయోగపడేవారికి స్థానం
దేవినేని నెహ్రూ వర్గంలోని పలువురు నాయకులకు అర్బన్ కమిటీలోని అన్ని కేటగిరిలలో ప్రాధాన్యత కల్పించారు. అనుబంధ సంఘాలలోను మంచి స్థానం కల్పించారని అంటున్నారు. అర్బన్ కార్యవర్గ ఎంపికలో ఎమ్మెల్యే జాబితాతో పాటు 2019లో ఉపయోగపడే వారికీ స్థానం కల్పించారు.
కీలక పదవి
ఇక, అవినాశ్ టీడీపీలో కొద్ది నెలల క్రితమే చేరినప్పటికీ అందరితో కలిసి ముందుకు సాగుతున్నారని అంటున్నారు. దీంతో ఆయనకు జిల్లాలో ఇబ్బందికరమైన పరిస్థితులు లేవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర యువత అధ్యక్షుడిగా ఆయనను నియమించేందుకు కొందరు జిల్లా నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారని అంటున్నారు.