జగన్ ప్లాన్: జూ.ఎన్టీఆర్ ఫ్రెండ్.. కొడాలి నానికి కీలక బాధ్యతలు
విజయవాడ: ఓ వైపు ఎమ్మెల్యేలు పార్టీని వీడి టిడిపిలో చేరుతుంటే.. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేల స్థానంలో బలమైన వారిని జగన్ ఇంఛార్జులుగా నియమిస్తూ, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇస్తున్నారు.
తాజాగా, పార్టీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి కీలక బాధ్యతలు అప్పగించారు. నానిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియమించారు. బుధవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
కొడాలి నాని నందమూరి కుటుంబానికి నమ్మిన బంటుగా పేరు బడ్డారు. నందమూరి కుటుంబంలోని హరికృష్ణ కుటుంబంతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్కు చాలా దగ్గర. పైగా, కొడాలి నాని టిడిపి కంచుకోట అయిన కృష్ణా జిల్లాలోని గుడివాడ ఎమ్మెల్యే.
హరికృష్ణ - జూనియర్ ఎన్టీఆర్కు క్లోజ్ అయిన కొడాలి నానికి కీలక బాధ్యతలు అప్పగించడం జగన్ రాజకీయ వ్యూహమేననే వాదనలు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో వైసీపీ తరఫున కొడాలి నాని ఒంటరి పోరు చేస్తున్నారు. నందమూరి అభిమానుల అండను ఆసరా చేసుకుని కొడాలి నాని అధికార పార్టీలో పోరు సాగిస్తున్నారంటారు.
ఈ క్రమంలోనే కొడాలి నానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని భావించినందునే జగన్ ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఉంటారని అంటున్నారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో కీలక మంత్రిగా పని చేసిన పార్టీ నేత కొలుసు పార్థసారధిని కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.