ఏపీతో ‘కియా’ ఒప్పందం: ట్రంప్ సర్కారు ఆరా, సీఎంఓ ఆశ్చర్యం
ప్రముఖ దక్షిణాఫ్రికా ఆటోమొబైల్ సంస్థ 'కియా'తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడాన్ని అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు నిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం.
అమరావతి: ప్రముఖ దక్షిణాఫ్రికా ఆటోమొబైల్ సంస్థ 'కియా'తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడాన్ని అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు నిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం. అసలు తమకు ఎంతమాత్రమూ తెలియకుండా, తమ అధికారులకు సమాచారం లేకుండా, ఇంత పెద్ద ఒప్పందం ఎలా కుదిరిందా? అని ఆరా తీస్తోందట.
అమెరికా ఆసక్తి
కియా సంస్థ... అనంతపురంలో దాదాపు రూ. 13 వేల కోట్ల పెట్టుబడులతో కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీల్ గురించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు అమెరికన్ కాన్సులేట్ సిబ్బంది స్వయంగా సీఎం కార్యాలయానికి వచ్చారు.
ఆరా-ఆశ్చర్యం
ఆ సంస్థ నిజంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందా? అని సీఎంఓ అధికారులను వారు అడగటం గమనార్హం. అమెరికన్ కాన్సులేట్ వర్గాలే ఈ డీల్పై ఆరా తీయడం ఇటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.
కియాతో ఒప్పందం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో దక్షిణ కొరియా దిగ్గజ కార్ల సంస్థ కియా మోటార్స్ ప్రతినిధులు.. రాష్ట్ర ప్రభుత్వంతో రెండ్రోజుల క్రితం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కియా మోటార్స్ కోసం తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడినప్పటికీ చివరకు ఈ సంస్థ ఏపీలోనే తమ ప్లాంట్ను నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది.
10వేల మందికి ఉపాధి
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద కియా కార్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం ఇందు కోసం 600 ఎకరాల స్థలం గుర్తించింది. దాదాపు 12 వేల కోట్ల పెట్టుబడితో ఈ కార్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.