అమరావతిలో రూ.500 కోట్లతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్: 5ఎకరాలు ఇచ్చిన దాత
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో రూ. 500 కోట్లతో కాకతీయ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (కెఐసిసి)ను నిర్మించడానికి ప్రణాళికను సిద్ధమయ్యాయి. దీనికి ఇండియన్ టొబాకో అసోసియేషన్ (ఐటీఏ) మాజీ అధ్యక్షుడు, పొగాకు వ్యాపారి చేబ్రోలు నరేంద్రనాథ్ 5ఎకరాల స్థలం ఇవ్వడానికి అంగీకరించడం గమనార్హం.
గుంటూరు పలకలూరు రోడ్డులో ఆదివారం పలు రాష్ట్రాలు, వివిధ జిల్లాలకు చెందిన కమ్మ సంఘం నేతలు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన భోజనాలలో దీనిపై ప్రణాళికను రూపొందించారు.
కెఐసిసి అధ్యక్షుడు జీవీ రాయుడు అధ్యక్షతన భారీ సభను నిర్వహించారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు ఈ సమావేశానికి హాజరై మాట్లాడారు.
అంతర్జాతీయ స్థాయిలో పేద వర్గాలను ఆదుకోవడానికి కెఐసిసి ముందుకు రావాలని సూచించారు. రాజధానికి అనుసంధానంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత వసతి కల్పించాలని సూచించారు.
సంస్థ చేపట్టే కార్యక్రమాలకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. కాగా, సభకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కెఐసిసి సభ్యత్వాలను మంత్రి పుల్లారావు, స్పీకర్ కోడెల పంపిణీ చేశారు.