షాకింగ్: గురుప్రసాద్.. ఒక్క వేటుతో పిల్లలు నేలకొరిగారు
హైదరాబాద్: ఇక్ఫాయ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గురుప్రసాద్.. తన పిల్లల్ని చంపేసి, తాను ఆత్మహత్య చేసుకున్న కేసులో.. పోస్టుమార్టం అనంతరం షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడ్చల్లో గురుప్రసాద్ పూడ్చిపెట్టిన కుమారులు విఠల్ విరంచి, నంద విహారి మృతదేహాలను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకోగా.. గాంధీ ఆసుపత్రి వైద్యులు మంగళవారం శవపరీక్ష నిర్వహించారు.
పిల్లలిద్దర్నీ పక్కపక్కనే నిలబెట్టి వేట కొడవలి లేదా పదునైన కత్తితో మెడ కింద ఒకే ఒక వేటు వేయడం వల్ల మెడ సగభాగంతో పాటు శరీరాన్ని కలిపే వెన్నుపూస విరిగి ఊపిరి ఆగిపోయిందని వైద్యులు తమ నివేదికలో తెలిపారు. అప్పటి వరకూ తాము చనిపోతామన్న భావన వారికి ఏ కోశాన లేదని చెప్పారు. ముఖ్యంగా నంద విహారి మెడపై వేటు పడిన వెంనటే ప్రాణం పోవడం వల్ల.. ప్రమాదాల్లో చనిపోయిన వారి ముఖ కవళికల్లో కనిపించే భయాందోళనలు వంటివి ఏమాత్రం కనిపించలేదంటున్నారు.
తమ తండ్రి చంపుతాడనే విషయమే వారికి తెలియనట్లుగా ఉందని తేలింది. మృతదేహాలను పూడ్చిపెట్టి ఒకరోజు దాటటంతో కుళ్లిపోయే దశకు చేరుకున్నాయి. తండ్రి అంత గట్టిగా కొడతాడని విఠల్కు ఏ మాత్రం ఊహించినా పోరాడేవాడని, చిన్నవాడు నం విహారికి ఇదేం తెలియదని, గురుప్రసాద్ కత్తితో వేటు వేయగానే ఊపిరి ఆగిపోయిందని తెలిపారు.
తాను లేనప్పుడు పిల్లలు సుఖంగా ఎలా ఉంటారోనన్న భయం, అనుమానం కలగలసిన ఆవేదనతో గురుప్రసాద్ ఇలా చేసి ఉండవచ్చునని చెబుతున్నారు. భార్య పైన కోపం... పిల్లల పైన ఉన్న మమకారాన్ని అధిగమించేసిందని పోలీసులు తెలిపారు. కాగా, పోస్టుమార్టం అనంతరం వారి అంత్యక్రియలను బన్సీలాల్పేట శ్మశానవాటికలో మంగళవారం నిర్వ హించారు. చిన్నారుల తాతయ్య (సుహాసిని తండ్రి) వారికి చితికి నిప్పంటించారు.
ఇదిలా ఉండగా.. పిల్లలను హత్య చేసిన రోజు భార్య సుహాసిని వద్దకు వచ్చి రమ్మని పిలిచినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, కలిసి కాపురం చేద్దామంటూ ఆమెను నమ్మించే ప్రయత్నాలు చేశాడని అనుమానిస్తున్నారు. పిల్లల గురించి ప్రశ్నించగా.. వారు గుడిలో భోజనం చేస్తున్నారని చెప్పాడు. ఏడాది కాలంగా సుహాసినిని అడగని గురుప్రసాద్.. పిల్లల్ని చంపేసిన రోజునే భార్యను బయటకు తీసుకెళ్లడానికి రావడంతో.. ఆమెనూ హత్య చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నాడేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సుహాసిని అతడితో బయటకు వెళ్లి ఉంటే ఆమెనూ హత్య చేసేవాడేమో అని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుప్రసాద్ పట్ల సుహాసిని అపనమ్మకానికి.. కారణం అతడి వ్యవహారశైలేనని.. పెళ్లయిన మర్నాటి నుంచే వేధించేవాడని ఆమె సోదరి గీత తెలిపారు. గురుప్రసాద్ మరికొద్ది నెలల్లో పదోన్నతి పొంది డీన్ అయ్యేవారని తెలిపారు.