రేపే లాస్ట్: కిరణ్ సంచలన 'దాటవేత': రెచ్చిపోయిన బొత్స
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు మాట్లాడుతారని విలేకరులు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. దానికి సమాధానంగా... రేపే ఆఖరి రోజు అని కిరణ్ అన్నారు. దేనికి ఆఖరి రోజు అని విలేకరులు మళ్లీ ప్రశ్నించగా.. అసెంబ్లీ సమావేశాలకు అని దాటవేశారు. రేపు మాట్లాడుతానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేపే రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా అంశంపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ బుధవారం మరోసారి తీవ్రంగా స్పందించారు. సిడబ్ల్యూసి నిర్ణయం రోజునే రాజీనామా చేయక పోవడం చారిత్రక తప్పిదమన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేసినా ప్రయోజనం లేదన్నారు. ఎంపీల బహిష్కరణకు, టి బిల్లుకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు చేయాల్సింది బిల్లును వ్యతిరేకిస్తున్న ఎంపీలకు అండగా ఉండటమేనని, రాజీనామాలు కాదన్నారు. ముందే పదవులు తీసుకోకుండా ఉంటే బాగుండేదన్నారు. కాంగ్రెసు ఎంత ముఖ్యమో సమైక్యత అంతే ముఖ్యమన్నారు.
పదవులు, సొంత వ్యవహారాల కోసం పక్కదారి పట్టించడం తగదన్నారు. ఇప్పుడు రాజీనామాల వల్ల ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు. సిడబ్ల్యూసి నిర్ణయం రోజునే అందరం కలిసి రాజీనామా చేస్తే అధిష్టానం పరిష్కారం చూపించేదని బొత్స అన్నారు. రాజీనామాల తర్వాత కూడా ఎవరైనా పదవుల కోసం వస్తే ఇంగితం లేని వాళ్లే వచ్చేవారన్నారు. రెండు రోజుల క్రితం కూడా బొత్స ముఖ్యమంత్రి రాజీనామాపై తీవ్రంగా స్పందించారు.
కాగా, అంతకుముందు ఈ ఉదయం వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభ ఐదు నిమిషాలపైన మాత్రమే జరిగి రేపటికి వాయిదా పడింది. సభ మొదలైన వెంటనే ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వివిధ ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో సమైక్యాంధ్ర, తెలంగాణ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. బిల్లులు సభ ఆమోదం పొందగానే సభాపతి నాదెండ్ల మనోహర్ రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు సభ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదించింది.