రిజైన్ చేసి మాట్లాడుతా: కిరణ్ సంచలనం, చూద్దామని...
కేంద్రం ఏకపక్షంగా పార్లమెంటులో తెలంగాణ ముసాయిదా బిల్లు పెడితే తాను రాజీనామా చేస్తానని గురువారం రాత్రి సీమాంధ్ర నేతలతో జరిగిన భేటీలో వ్యాఖ్యానించారట. ఈ నెల 10వ తేదీన రాజ్యసభలో తెలంగాణ ముసాయిదా బిల్లును పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
ఢిల్లీ నుండి వచ్చిన ఆయనను గురువారం ఉదయం నుండి రాత్రి వరకు క్యాంపు కార్యాలయంలో మంత్రులు, శాసన సభ్యులు, ఇతర నాయకులు పలువురు కలిశారు. రాజ్యసభ ఎన్నికలు, భవిష్యత్తు కార్యాచరణపై వారి మధ్య చర్చలు చోటు చేసుకున్నాయి.
మంత్రులు కాసు వెంకట కృష్ణా రెడ్డి, గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్ తదితరులు కలిసి భవిష్యత్తు కార్యాచరణ గురించి అడిగారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. పార్లమంటుకు విభజన బిల్లు వచ్చినప్పుడు పదవిలో కొనసాగనని తేల్చి చెప్పారట.
ఇంతకాలం సమైక్యం కోసం పోరాటం చేశామని, సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న తాను విభజన ఖాయమని తెలిసిన తర్వాత ఇంకా ఆ పదవిలో ఉండటం సరికాదని వ్యాఖ్యానించారట. దానికి సీమాంధ్ర నాయకులు.. అందరం కలిసి నిర్ణయం తీసుకుందామని, అక్కడి చర్యను బట్టి ఇక్కట ప్రతిచర్యకు దిగుదామని పలువురు సూచించారట.