ప్రపంచ తెలుగువారికోసం పార్టీ, జర్మనీయే కల్సింది:కిరణ్
హైదరాబాద్: ప్రపంచంలోని తెలుగు వారి గుండె చప్పుడు వినిపించేందుకు తాము కొత్త పార్టీని పెడుతున్నామని, ఆంధ్రప్రదేశ్లో తాము పోటీ చేస్తామని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ నెల 12న రాజమండ్రిలో నిర్వహించే బహిరంగ సభలో విధివిధానాలు చెబుతామన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసమే తమ పార్టీ ఉంటుందన్నారు. తాము పార్టీ పెడుతోంది.. పదవుల కోసం కాదని, ప్రజల కోసమన్నారు. తెలుగు వారిని అవమానిస్తే ప్రతిఘటించేందుకే తమ పార్టీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియను తాము పూర్తిగా వ్యతిరేకించామన్నారు. విభజనను వ్యతిరేకిస్తూనే తాను రాజీనామా చేశానన్నారు. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంభించిందని దుయ్యబట్టారు. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పటి వరకు కూడా స్పష్టత లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ప్రవర్తించిన తీరు బాధాకరమన్నారు. ఆయన అసెంబ్లీలో కూడా తన అభిప్రాయాన్ని చెప్పలేదని విమర్శించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విభజనకు సహకరించిందని ఆరోపించారు. ఆ పార్టీ బయటనేమో సమైక్యవాదమంటూ, లోపల మాత్రం విభజనను సమర్థించిందన్నారు. విభజన జరిగితేనే ముఖ్యమంత్రి అవుతానని జగన్ భావించారన్నారు. రాష్ట్రం కలిసుంటుందో, విడిపోతుందో తెలియని సమయంలో ప్లీనరీలో జగన్ తాను కాబోయే ముఖ్యమంత్రినని ప్రకటన చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెసు, బిజెపిలు కలిసి తెలుగు రాష్ట్రానికి అన్యాయం చేశాయన్నారు.
భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సీమాంధ్రకు జరిగిన అన్యాయంపై స్పష్టంగా చెప్పారన్నారు. పురుడు పోసి తల్లిని చంపారని మోడీ అన్నారు. ఇక బిజెపి అగ్రనేత అద్వానీ ఇంత దుర్మార్గమైన బిల్లును తాను జీవితంలో చూడలేదని, సుష్మా స్వరాజ్ బిల్లే పెట్టలేదని, ఎంపీలు వెల్లోకి పోతే హృదయం గాయపడిందని ప్రధాని అన్నారని గుర్తు చేశారు. పార్లమెంటులో మన ఎంపీలను బహిష్కరించిన తీరు అవమానకరమన్నారు.
వివిద దశల్లో తాము సమైక్యం కోసం పోరాటం చేశామన్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికల్లో నోటా వచ్చిందన్నారు. పార్టీలను తిరస్కరించే అవకాశం ప్రజలకు ఉందన్నారు. ఆత్మవంచన చేసుకొని ప్రజలు ఎవరూ కూడా విభజనకు సహకరించిన పార్టీలకు ఓటేయరని తాము భావిస్తున్నామన్నారు. తాము పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసమే తాము పార్టీ పెడుతున్నామన్నారు.
తెలుగు వారు ఎక్కడున్నా వారి ఆత్మగౌరవం కోసం పోరాడుతుందన్నారు. తెలంగాణ, సీమాంధ్రల్లోనే కాకుండా ప్రపంచంలో ఉంటే తెలుగు వారి అందరి గుండె చప్పుడు అర్థం చేసుకునేలా తమ పార్టీ ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాము పోటీ చేస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 12న మొదటి సభను పెడుతున్నామని, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుతామని చెప్పారు. రాజమండ్రి సభలో పార్టీ విధివిధానాలు చెబుతామన్నారు.
విభజనకు కారణమైన పార్టీలో నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాయన్నారు. వారికి అధికార దాహం తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలది అధికార దాహమే అన్నారు. తమ పార్టీ లక్ష్యం మాత్రం తెలుగు వారి గుండె చప్పుడు వినిపించేందుకే అన్నారు. తెలుగు వారి ప్రతిస్పందనలే తమ పార్టీ ప్రణాళికలని చెప్పారు. తాను పదవులు వదులుకొని పార్టీ పెడుతున్నానని చెప్పారు. అలాంటప్పుడు పదవుల కోసమే పార్టీ అనడంలో అర్థం లేదన్నారు.
తనతో ఎవరు కలిసి రాకున్నా ఫరవాలేదని కానీ, తెలుగు ప్రజల తరఫున నిలిస్తే చాలన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఇటీవల పలువురు నేతలు ఢిల్లీ పరుగెత్తినట్లు తాను మీడియాలో చూశానన్నారు. అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేశారనే బాధతో రాజీనామా చేశానన్నారు. తెలుగు వారి పట్ల ప్రవర్తించిన తీరు తనను కలచి వేసిందన్నారు. బిల్లు సమయంలో లైవ్ కాస్ట్ కూడా ఆపివేశారని విమర్శించారు.
జర్మనీ లాంటి దేశమే కలిసిపోయింది
సుప్రీం కోర్టులో పిటిషన్ వేశామని అనుకూలంగా నిర్ణయం వస్తుందని కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. జర్మనీయే గోడలు బద్దలు కొట్టి మరీ కలిసిపోయిందని, తెలంగాణ, సీమాంధ్ర మధ్య గోడలు కూడా లేవన్నారు. తాము ఎప్పుడు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు చెప్పలేదన్నారు. తెలంగాణ ఏర్పడితే విద్యుత్ కొరత ఉంటుందని తాను చెప్పిన మాట నిజమైందన్నారు.
కొరత ఉంటే తాము చత్తీస్ గఢ్ నుండి విద్యుత్ తెచ్చుకుంటామని కెసిఆర్ చెప్పారని కానీ, ఆ రాష్ట్రానికే విద్యుత్ కొరత ఉందన్నారు. తాను నిన్న, నేడు, రేపు ఎప్పుడు వాస్తవాలే చెబుతున్నాని అన్నారు. ప్రజలకు నష్టం జరుగుతుందనే తాను మాట్లాడానన్నారు. తెరాస అవాస్తవాలను చెప్పిందని ఆయన అభిప్రాయపడ్డారు. కెసిఆర్కు తెలంగాణ వచ్చే వరకు కాంగ్రెసు పార్టీ కావాలి, విద్యుత్ పవర్ ప్రాబ్లం ఉండొద్దు.. కానీ ఇప్పుడేమయిందన్నారు.












Click it and Unblock the Notifications