సుదీర్ఘ స్పీచ్కు కిరణ్ సిద్ధం: 450పేజీలు, 10గంటలు!
కాగా, బిల్లు పైన సుదీర్ఘంగా మాట్లాడేందుకు కిరణ్ సిద్ధమవుతున్నారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సమైక్య రాష్ట్రంతో ఇరు ప్రాంతాలకు కలిగే ప్రయోజనాలను సభలో ఆయన చెప్పనున్నారు. విభజన బిల్లుపై సభలో తన ప్రసంగం కోసం కిరణ్ భారీ కసరత్తు చేశారట. వీలైనంత సమగ్రంగా చర్చించేలా అందుకు అవసరమైన సమాచారాన్ని ఆయన సిద్ధం చేసుకున్నారట. విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కిరణ్ తన వాదనను పకడ్బందీగా, సమర్థంగా సభలో వినిపించాలని భావిస్తున్నారు.
ఇందుకోసం బిల్లుపై పది రోజుల క్రితం అధ్యయనం ప్రారంభించారట. బిల్లులోని అంశాలు, వాటి పూర్వాపరాలపై సమాచారం తీసుకున్నారు. గతంలో జరిగిన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల బిల్లులతో పాటు శాసన సభలో చర్చల వివరాల ప్రతులను కూడా సిఎం తెప్పించుకున్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై రాజ్యాంగపరమైన అనుకూలతలు, ప్రతికూలతలపై ఆయన నిపుణులతో చర్చించారు.
తెలుగు వారి చరిత్ర, 1956లో రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులకు సంబంధించిన వివరాలతో పాటు ప్రాంతాలవారీగా అభివృద్ధి, గణాంకాలు, వనరుల వివరాలు తెలుసుకున్నారట. అలాగే అధిష్టానం వద్ద వినిపించిన వాదనల గురించి ప్రత్యేక నివేదికను సిద్ధం చేశారట.
పొడిగింపుపై ఎల్లుండి నిర్ణయం
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సమయం పొడిగించాలని రాసిన లేఖపై రెండు రోజుల్లో సమాధానం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పయ్యావుల ప్రసంగంపై నేతలు
మరోవైపు సీమాంధ్ర టిడిపి నేత పయ్యావుల కేశవ్ ప్రసంగంపై పలువురు నేతలు సభలో స్పందించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి, నేటి పోరాటానికి పోలిక లేదని, నాటి పోరాటంపై పయ్యావుల, శైలజానాథ్ మాట్లాడటం సరికాదని కూనంనేని సాంబశివ రావు అన్నారు. విశాలాంధ్ర కోసం తాము పోరాటం చేశామని చెప్పారు. ప్రజల ఆకాంక్ష దృష్ట్యా తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
పయ్యావుల ప్రసంగం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని మంత్రి దానం నాగేందర్ అన్నారు. కేశవ్ అమాయకంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి టిడిపి లేఖ ఇచ్చిందని గుర్తు చేశారు. సోనియా పైన పయ్యావుల అన్న వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని కోరారు.
సమైక్యాంధ్ర అంటున్న వారు ఇంతకుముందు రాయల తెలంగాణ అని కూడా అన్నారని, రాయల తెలంగాణ ఇస్తే ఓకే.. లేదంటే దుర్మార్గం అవుతుందా అని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఎన్టీఆర్ తెచ్చిన 610 జివోను తొక్కి పెట్టింది టిడిపియే అన్నారు. తమ పోరాటం పదవుల కోసం కాదన్నారు. తెలంగాణ తమ ప్రజల ఆకాంక్ష అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కొత్త ఆశలు చిగురించాయని, అందరూ సహకరించాలని మంత్రి సునిత లక్ష్మా రెడ్డి కోరారు.
శ్రీధర్ బాబు ఏం తప్పు చేశారని శాసన సభ వ్యవహారాల నుండి తొలగించారని, తాము టి బిల్లును సమర్థిస్తున్నామని దామోదర రెడ్డి అన్నారు. రాష్ట్రపతి పంపిన బిల్లును రాజ్యాంగ వ్యతిరేకం అనడం సరికాదన్నారు. అలా మాట్లాడిన మంత్రులను ముఖ్యమంత్రి వెంటనే తొలగిస్తే బాగుండేదన్నారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని, శాస్త్రీయంగానే రాష్ట్రం ఏర్పడుతోందన్నారు. నిజాం గొప్పవాడు కాదని, నాటి పోరాటంలో అందరు పాల్గొన్నారని, సాయుధ పోరాటానికి, నేటి పోరాటానికి పోలిక లేదని జూలకంటి రంగారెడ్డి అన్నారు.