కాంగ్రెస్ పార్టీకి, సిఎం పదవికి రాజీనామా చేస్తున్నా: కిరణ్
హైదరాబాద్: సీట్ల కోసం, అధికారం కోసం తెలుగు జాతికి కాంగ్రెసు, బిజెపి, టిడిపి, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు.. ఇలా అన్ని పార్టీలు నష్టం కలిగించాయని, విభజనలో పాలు పంచుకున్నాయని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నారు. సీట్లు, అధికారం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. పార్లమెటులో పెట్టిన బిల్లులో తాను లేవనెత్తిన లోపాలు అనేకం ఉన్నాయన్నారు.
విభజన వల్ల రెండు ప్రాంతాలకు నష్టం జరుగుతుందన్నారు. విభజన బిల్లును టేబుల్ ఐటంగా తీసుకు రావడమేమిటన్నారు. బిల్లును చదువుకునేందుకు కూడా ద్రమంత్రులకు సమయం ఇవ్వలేదని దుయ్యబట్టారు. విభజన జరిగినప్పుడు ప్రజలకు మేలు జరగాలని కానీ, ఈ విభజన వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. రైతులు, విద్యార్థులు, యువకులు... ఇలా అందరికీ నష్టమే అన్నారు. అన్ని పార్టీలు తెలుగు జాతికి నష్టం చేశాయన్నారు.
59 ఏళ్లలో ఎన్నో రంగాల్లో తెలంగాణ, సీమాంధ్రల మధ్య అనుబంధం ఏర్పడిందన్నారు. విభజన నిర్ణయంలో ప్రతి అంశంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయన్నారు. విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుకు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందన్నారు. విభజన విషయంలో సంప్రదాయాలు పాటించలేదన్నారు. జివోఎం ఏర్పాటు, జివోఎం నిర్ణయాలు అన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలేనని కిరణ్ రెడ్డి నిప్పులు చెరిగారగు.
సభలో కొట్టడమా?
పార్లమెంటులో సహచర ఎంపీలే సీమాంధ్ర ఎంపీలను కొట్టడమేమిటని ప్రశ్నించారు. ఏ రాష్ట్ర విభజన జరుగుతుందో ఆ రాష్ట్ర ఎంపీలను ఎలా సస్పెండ్ చేసి చర్చిస్తారని ప్రశ్నించారు. దొంగల్లా ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి బిల్లుకు లోకసభ ఆమోదం తెలపడం ఎంత వరకు సమంజసమన్నారు. భారత దేశ చరిత్రలో ఇప్పటి వరకు అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టలేదన్నారు. తెలుగు ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా బిజెపి మద్దతివ్వడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెసు, బిజెపి చీకటి ఒప్పందానికి తెలుగు హృదయాలు గాయపడ్డాయన్నారు. కేంద్రంతో బిజెపి చీకటి ఒప్పందం చేసుకుందన్నారు.
ప్రధానికి కౌంటర్
ఎంపీలు వెల్లోకి వెళ్తేనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హృదయం గాయపడితే, రాష్ట్ర విభజనతో పదికోట్లమంది తెలుగు ప్రజల హృదయాలను గాయపర్చడం ఎంత వరకు సమంజసమన్నారు. తెలుగు జాతిని నిలువునా చీలుస్తున్నందుకు ప్రధానికి బాధ లేదా అన్నారు. తెలుగు వారిని నిలువుగా చీల్చడం ప్రధానికి కనిపించలేదా అన్నారు.
సిఎం పదవికి, కాంగ్రెసు పదవికి రాజీనామా చేస్తున్నా
తాను కాంగ్రెసు పార్టీ వల్లే ఈ స్థాయికి ఎదిగానని కిరణ్ చెప్పారు. కాంగ్రెసు పార్టీ విభజన నిర్ణయం తీసుకున్నందున తాను కాంగ్రెసు పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. విభజన నిర్ణయం తీసుకున్నట్లు తనకు చెప్పలేదన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నప్పుడే రాజీనామా చేస్తే అధిష్టానం ఒప్పుకోలేదన్నారు. ఇతరులు కూడా వద్దన్నారన్నారు.
సోనియా గాంధీని వ్యక్తిగతంగా కలిసినప్పుడు విభజనపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదన్నారు. విభజనకు ప్రత్యామ్నాయంగా శ్రీకృష్ణ కమిటీ సూచించిన ప్యాకేజీ ఇవ్వాలని చెప్పానన్నారు. తన రాజీనామా వల్ల విభజన నిర్ణయం ఆగుతుందా లేదా అని కాదని, తెలుగు ప్రజలకు నష్టం జరుగుతున్నందునే, అందుకు నిరసనగా రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంతో ఉన్నాళ్లు తాము పోరాటం చేశామని చెప్పారు. విభజన నిర్ణయంపై తనకు చెప్పలేదని అధిష్టానంపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీకి పంపిన బిల్లును పెడితే రాజీనామా చేస్తానని అప్పుడే చెప్పానని అన్నారు. తాను రాజీనామా చేస్తున్నానని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని గవర్నర్కు చెబుతానని అన్నారు. తన భవిష్యత్తు, కొత్త పార్టీ అవి ముఖ్యం కాదన్నారు. తెలుగు ప్రజల క్షేమం తనకు ముఖ్యమన్నారు.
తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనని కిరణ్ చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని గవర్నర్కు చెబుతానన్నారు. ఇన్నాళ్లు తాను పదవిలో ఉన్న కారణంగానే తెలంగాణ ఏర్పాటు ఆలస్యమైందని, నాలుగు నెలల క్రితం తాను రాజీనామా చేస్తే అప్పుడే విభజన జరిగేదన్నారు. తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చనందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని, ఇన్నాళ్లు తాను ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలన్నారు.