కిరణ్ మెలిక, అధిష్టానం కినుక: ఉద్వాసన తప్పదా?

కిరణ్ జివోఎం ముందు సమైక్యవాదమే వినిపించే అవకాశముంది. తన అభిప్రాయాన్ని కాదని తెలంగాణపై కేంద్రం ముందుకు వెళ్తే కిరణ్ దేనికైనా సిద్ధమనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు. అధిష్టానం ఇప్పటికిప్పుడు దిగిపోమని చెప్పినా కిరణ్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అదే జరిగితే ప్రత్యామ్నాయం కోసం పెద్దలు యోచిస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. తన హయాంలోనే బిల్లు వస్తే గడువుపై కిరణ్ మెలిక పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. రాష్ట్రపతి పాలన తప్పక పోవచ్చంటున్నారు.
రాష్ట్ర సమైక్యత గళం, సమైక్యత ఆవశ్యకతను సోదాహరణంగా జివోఎంకు వివరించేందుకు కిరణ్ సిద్ధమయ్యారు. మరికొన్ని అస్త్రాలతో ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్రం తన వాదనతో ఏకీభవిస్తుందని కానీ కనీసం ప్రతిస్పందిస్తుందని కానీ ముఖ్యమంత్రికి ఏ కోశానా నమ్మకం లేదు. అలాగే, కిరణ్ తమ దారికి వస్తారని, విభజనకు సహకరిస్తారన్న ఆశ నామమాత్రంగానైనా అధిష్ఠానానికి లేదు. అయినప్పటికీ మంత్రుల బృందం పిలవడంతో కిరణ్ జివోఎం ఎదుటకు వెళ్తున్నారు.
అయితే, ఈ చర్చలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధిష్ఠానం ఎలాంటి చర్య తీసుకుంటే ఏం చేయాలనే దానిపై ముఖ్యమంత్రికి పూర్తిస్థాయి స్పష్టత ఉంది. కానీ, కిరణ్ విషయంలో ఏం చేయాలనేదానిపైనే అధిష్ఠానానికి స్పష్టత లేదు. విభజన ప్రక్రియ తాను అనుకున్నట్లు జరగాలంటే కిరణ్ పదవిలో ఉండటం పెద్ద అవరోధమేనని అధిష్ఠానం భావిస్తోంది. మరి, ఆయనను తప్పిస్తే ఎవరో ఒకరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాలి, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో అనే అనుమానాలు ఢిల్లీ పెద్దలకు ఆందోళన కలిగిస్తోందట.
కిరణ్ మరోసారి వ్యతిరేకంగా ఉంటే అధిష్టానం గద్దె దిగమంటే ఆయన సిద్ధంగా ఉన్నారట. హైదరాబాద్కు వచ్చి తాను, తనతోపాటు కలిసి వచ్చే ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేసే అవకాశముంది. కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సీమాంధ్ర నేతలెవరూ సిద్ధంగా లేరు. తెలంగాణ నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినా సీమాంధ్రకు చెందినవారు మంత్రివర్గంలో చేరేందుకు ఇష్టపడరు. మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వమే లేకుండా పోయే ప్రమాదముంది. అప్పుడు రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తుంది. ఇది చెడు సంప్రదాయంగా మిగిలిపోతుందని అందరూ భావిస్తున్నారు. దీంతో కిరణ్ను తప్పించే విషయమై తర్జన భర్జన పడుతోందంటున్నారు.
కిరణ్ హయాంలోనే ముసాయిదా బిల్లు రాష్ట్ర శాసనసభకు వస్తే దానిపై అభిప్రాయం చెప్పేందుకు మరింత గడువు కావాలని ముఖ్యమంత్రి కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం బిల్లుపై అసెంబ్లీ తన అభిప్రాయం చెప్పేందుకు వారానికి మించి సమయం ఇవ్వబోరని తెలుస్తోంది. అయితే గతంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల విభజన సమయంలో ఆ రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్రం 45 రోజులు గడవు ఇచ్చింది.
ఈ గడువు కూడా చాలదనడంతో ఉత్తరప్రదేశ్కు మరో 25 రోజులు అదనపు సమయం ఇచ్చింది. ఇదే విషయాన్ని ఉదహరిస్తూ తమ సభ్యులందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు సరిపోదని, మరింత సమయం కావాలని ముఖ్యమంత్రి కోరే అవకాశముంది. ఆయన కోరినట్లుగా గడువు పొడిగించకుండా సభను కొనసాగించి, అర్ధాంతరంగా వాయిదా వేసి, బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే అప్పుడు సిఎం తన వర్గంతోపాటు రాజీనామాస్త్రాలు సంధిస్తారని చెబుతున్నారు.
మరోవైపు అధిష్ఠానం కిరణ్ను దారికి తెచ్చుకునేందుకు మరో వారం రోజులు గడువు ఇచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీలోపు తెలంగాణపై అధిష్ఠానం వైఖరికి అనుగుణంగా తల ఊపకపోతే ఉద్వాసన తప్పదని, రాజకీయ సంక్షోభం సృష్టించే ప్రయత్నాలు చేస్తే రాష్ట్రపతి పాలనకు కూడా వెనుకాడబోమని ఢిల్లీ పెద్దలు కిరణ్ను హెచ్చరించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
ఈ నెల 25 తర్వాత ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీకి బిల్లు పంపే అవకాశాలున్నాయి. అందువల్ల ఈలోపే కిరణ్ విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడినట్లుగా చెబుతున్నారు. కేంద్ర హోం శాఖ వర్గాల ప్రకారం డిసెంబర్ 6న కానీ, 7న కానీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశముంది. ఇంకోవైపు విభజనపై ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర నేతలు తెలంగాణపై దూకుడుగా వెళ్లకుండా ఉండేందుకు చేసే అంశంపై దృష్టి సారిస్తున్నారు.












Click it and Unblock the Notifications