ఉద్వాసనకు కిరణ్ నిరీక్షణ: పీఠానికి ఆనం వెయిట్?
తనంత తానుగా రాజీనామా చేసే కన్నా అధిష్టానం తనపై వేటు వేస్తే తన రాజకీయ జీవితానికి ఉపయోగపడుతుందని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందువల్లనే తెలంగాణపై అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. ఇదే ఉద్దేశంతో ఆయన మరో మీడియా సమావేశం పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి ఉద్దేశాన్ని అధిష్టానం పసిగట్టి, సమైక్యాంధ్ర హీరోగా మారకుండా చూసే దిశగా అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతోనే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సీమాంధ్రకు చెందిన మంత్రులను కొందరిని ఉసిగొల్పినట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆనం రామనారాయణ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారని, మరో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి తీరును తప్పు పట్టారని అంటున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఆనం రామనారాయణ రెడ్డిని గానీ ఎస్ జైపాల్ రెడ్డిని గానీ ఆ పీఠంపై కూర్చోబెట్టాలనే ఆలోచన అధిష్టానానికి ఉన్నట్లు చెబుతున్నారు. అధిష్టానం తనకు ఉద్వాసన పలికితే సీమాంధ్రలో హీరో అయి కొత్త పార్టీ పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి చూస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే, అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.