కిరణ్ రెడ్డి రాజీనామా: రాష్ట్రపతి పాలన ఖాయం?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెసు పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ఉదయం ప్రకటించారు.
తెలంగాణ బిల్లు లోకసభలో ఆమోదం పొంది, రాజ్యసభలో ఆమోదం పొందడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా విషయాన్ని ప్రకటించారు. తెలంగాణ బిల్లుకు బిజెపి ఆమోదం తెలుపుతుందా, లేదా అనే సందేహంలో కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చినట్లు చెబుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో మార్గం లేదని అంటున్నారు. తాను ముఖ్యమంత్రిగా కొనసాగబోనని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిదని తాను గవర్నర్కు చెబుతానని ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ప్రస్తుత స్థితిలో కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) సమావేశాన్ని ఏర్పాటు చేసి, కొత్త నాయకుడిని ఎంపిక చేసుకునే ఏర్పాటు చేయడం సాధ్యం కాదని పార్టీ అధిష్టానం భావిస్తోంది. శాసనసభ్యులు ప్రాంతాలవారీగా విడిపోయిన నేపథ్యంలో అది సాధ్యం కాదని అంటున్నారు. దీంతో రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో మార్గం ఉండదనే భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు కెంద్ర మంత్రి జైరాం రమేష్ ఓ తెలుగు మీడియా సంస్థతో చెప్పారు. లోకసభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని కూడా చెప్పారు.
కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాను గవర్నర్ నర్సింహన్ ఆమోదించారు. తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగలేనని కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్తో చెప్పారు. దీంతో రాష్ట్రపతి పాలన విధించడమే ఖాయంగా కనిపిస్తోంది. బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.