కిరణ్ రిజైన్పై ఉత్కంఠ, జగన్పై ఫైర్: తెలియదని బొత్స
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాపై ఉత్కంఠ కొనసాగుతోంది. కిరణ్ ఆదివారం రాత్రికి రాజీనామా చేసే అవకాశాలున్నాయని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసన సభ్యులు జెసి దివాకర్ రెడ్డి శనివారం వ్యాఖ్యానించారు. కిరణ్ పార్టీ పెట్టవచ్చునని చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు రాజీనామా చేసే అవకాశముందన్నారు.
ఈ రోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కిరణ్ నేతృత్వంలో సీమాంధ్ర నేతలు భేటీ కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. కాగా, ఈ భేటీ గురించి తనకు తెలియదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ చెప్పారు. మరోవైపు కిరణ్ పార్టీ పెడ్డరని మంత్రులు కొండ్రు మురళి, డొక్కా మాణిక్యవర ప్రసాద రావు అన్నారు.
జగన్ పైన కిరణ్ మండిపాటు
ముఖ్యమంత్రిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఇతర నేతలు కలిశారు. ఈ సమయంలో కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి విభజనవాది అని వారితో అన్నారు. సమైక్యమని చెబుతూనే విభజనకు ఆయన తాపత్రయపడుతున్నారని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర విభజన జరిగితే తన పార్టీ ఇరవై అయిదు సీట్లు గెలుచుకుంటుందని, ఎన్నికల తర్వాత బిజెపి వైపు వస్తానని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్కు జగన్ హామీ ఇచ్చారని కిరణ్ వ్యాఖ్యానించారు.
భేటీ అనంతరం సిపిఐ నారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిది సమైక్యవాదం, తమది విభజన వాదమని, అయినా రాజకీయాలు రాజకీయాలే అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఓ కొలిక్కి రాలేదన్నారు.