ముందేం చెప్పను.. చేస్తాను, అది గుడ్ ఐడియా: కిరణ్
హైదరాబాద్: తాను ఏదీ ముందుగా చెప్పనని, అన్నీ చేతలేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, విభజిస్తే రెండు ప్రాంతాలకూ నష్టమేనని అధిష్ఠానానికి స్పష్టం చేశానని అయినా తన మాట వినడం లేదని, అందుకే ప్రజల పక్షాన నిలవాల్సి వచ్చిందన్నారు. అధిష్ఠానంతో మ్యాచ్ ఫిక్సింగే ఉంటే ప్రజల పక్షాన నిలిచి పార్టీని ధిక్కరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా కూడా ఓటింగ్ లేకుండా రాష్ట్రాలు ఏర్పడలేదని తెలిపారు.
1956లో ఆంధ్రప్రదేశ్ కూడా ఓటింగ్ ద్వారానే ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా ముసాయిదా బిల్లుపై చర్చపైనే ఉందని, ఆ తర్వాతే ఇతర అంశాలపై దృష్టి సారిస్తామని వివరించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని తన చాంబర్లో శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అధిష్టానం విభజన మాట వీడట్లేదని, అందుకే తాను జన బాట అంటున్నానని చెప్పారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయా అన్న ప్రశ్నకు తాను జ్యోతిష్యుడిని కాదన్నారు.

ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఏ సినిమాలు హిట్ అవుతాయో చెప్పే పండితులు లేరన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఎంపి లగడపాటి రాజగోపాల్ మాత్రమే కరెక్టుగా చెప్పారన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన ప్రేమ లేఖ అందిందని ముఖ్యమంత్రి చెప్పారు. దానిని ఆమోదించాలని నిర్ణయం తీసుకుంటే ముందుగా మీడియాకు చెబుతానన్నారు. తన వద్ద శ్రీధర్ బాబుతో పాటు సీమాంధ్రకు చెందిన 13 మంది మంత్రుల రాజీనామా లేఖలు కూడా పెండింగ్లో ఉన్నాయన్నారు.
తాను కరీంనగర్కు వస్తే హెలికాప్టర్ను పేల్చేస్తానంటూ ఎంపి పొన్నం ప్రభాకర్ చేసిన చౌకబారు ప్రకటనలకు స్పందించబోనని కిరణ్ అన్నారు. తాను ఎప్పుడూ మర్యాద, మన్ననలకు గౌరవం ఇస్తానని, కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడబోనని చెప్పారు. ఆదివారం తాను కరీంనగర్ పర్యటనకు వెళ్లడం లేదన్నారు. ఇదే సమావేశంలో మరోసారి పొన్నం వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చినప్పుడు పరిణతి చెందని వ్యక్తులు మాట్లాడే మాటలను పట్టించుకోనని వ్యాఖ్యానించారు.
ముసాయిదా బిల్లుపై ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా చర్చ ప్రారంభం కావాలని ఆశిస్తున్నానని, ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలతో మాట్లాడే ప్రక్రియ మొదలైందని, బహుశా సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచే అసెంబ్లీలో చర్చ మొదలయ్యే అవకాశం ఉందన్నారు. శాసన సభలోనూ శాసన మండలిలోనూ ముసాయిదా బిల్లుపై చర్చను చేపట్టడం ద్వారా తమ ప్రాంత ప్రజల మనోభావాలను తెలిపే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయా పార్టీలకు సూచించారు.
చర్చ నిర్వహణ అంశం స్పీకర్, చైర్మన్ పరిధిలోనిదన్నారు. బిల్లుపై సాధారణ చర్చ జరగాలా? క్లాజులవారీ సవరణలపై చర్చ జరగాలా అనే అంశంపై వారే నిర్ణయం తీసుకుంటారన్నారు. రాష్ట్ర విభజనపై అభిప్రాయాలు పత్రికల్లో వస్తే ఉపయోగం లేదని, అసెంబ్లీలో చర్చించడం ద్వారా మాత్రమే అవి రాష్ట్రపతికి, కేంద్రానికి చేరుతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సూచించారు. దేశంలో ఎక్కడైనా ఓటింగ్ లేకుండా రాష్ట్ర విభజన జరిగిందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల విభనజ ఎలా జరిగిందో చూడాలన్నారు. ఓటింగ్ తప్పనిసరన్నారు.
పాలెం బస్సు దుర్ఘటన బాధితులు కోరుతున్నట్లు రూ.25 లక్షల పరిహారం, ఇంటికో ప్రభుత్వోద్యోగం ఇవ్వడం అసాధ్యమని కిరణ్ తేల్చి చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములకు చిన్న చిన్న కారణాలే ప్రధానాంశాలవుతాయని అన్నారు. తన ముఖ్యమంత్రి పదవి తెరిచిన పుస్తకమని, ఎక్కడా అవినీతికి తావుండదన్నారు. రోజూ వందలాది ఫైళ్లు వస్తుంటాయని, అన్నీ కాంట్రాక్టులకు సంబంధించినవే ఉండవని, ఉద్యోగుల బదిలీలు, ఆరోగ్యం, పాలన సంబంధిత ఫైళ్లపైనా సం తకాలు చేస్తుంటానని చెప్పారు.
కొత్త పార్టీ ఏర్పాటుపై ఈనెల 23వ తేదీ వరకు వేచి చూడాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దానిపై తాను ఎలాంటి అభిప్రాయం వెల్లడించనన్నారు. ఆలూ లేదు. చూలూ లేదు. కొడుకు పేరు సోమలింగమన్నట్లు తాను రాజకీయ పార్టీని స్థాపించే అంశం మారిపోయిందన్నారు. ఇప్పుడు తన దృష్టంతా బిల్లు పైనే అని చెప్పారు. కొత్త పార్టీపై తనకు వెనుక ద్వారమేదీ లేదంటూ వ్యాఖ్యానించారు.
17న ఢిల్లీలో ఏఐసిసి సమావేశానికి వెళ్తానో లేదో తెలియదన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 30 మంది వరకూ శాసనసభ్యులు బయటకు వెళ్లిపోయారని వ్యక్తిగతంగా ఎవరినీ ఆపలేమని అన్నారు. మరో 30 మంది పార్టీని వీడే యోచనలో ఉన్నారంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు తనకు తెలియదన్నారు. రిజైనే చేస్తారని, అసెంబ్లీని డిసాల్వ్ చేస్తారనే వార్తా కథనాల పైన కిరణ్ స్పందించారు. ఇది చాలా గుడ్ ఐడియా అన్నారు.












Click it and Unblock the Notifications