హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది, విభజిస్తే ముప్పు: కిరణ్
న్యూఢిల్లీ: ప్రస్తుతం హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని, విభజన జరిగితే ముప్పు ఉంటుందని తాను మంత్రుల బృందానికి (జివోఎం)కు నివేదించానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. గంటన్నర పాటు జివోఎం సభ్యులతో భేటీ అయిన కిరణ్ మూడు గంటలకు విలేకరులతో మాట్లాడారు.
విభజన అంశంపై జివోఎంకు తాను రెండు పుస్తకాలు ఇచ్చానని, అందులో అన్ని విషయాలను వివరించానని తెలిపారు. విభజన జరిగితే పలు సమస్యలు వస్తాయని తాను చెప్పానన్నారు. హైదరాబాద్, విద్య, ఉద్యోగం, వైద్యానికి సంబంధించిన సమస్యలు వస్తాయన్నారు. నక్సలిజం పెరిగే అవకాశముందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల అంశంలో 371 డి అంశంపై సమస్యలు వస్తాయన్నారు.

దేశ భద్రత అంశానికి సంబంధించిన అంశాన్ని కూడా తానిచ్చిన నివేదికలో పొందుపర్చానని చెప్పారు. విభజన జరిగితే సమస్య మరింత జఠిలమవుతుందని దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎప్పుడో చెప్పారన్నారు. సాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతుయాన్నారు. ఫార్మా కంపెనీలు అన్ని హైదరాబాదులోనే ఉన్నాయన్నారు. విభజన జరిగితే నక్సలిజం పెరిగే అవకాశముందన్నారు. నక్సలిజంలో రాష్ట్రానికి చెందిన వారే అగ్రనాయకులుగా ఎక్కువ మంది ఉన్నారన్నారు.
ఉగ్రవాదుల దాడులు కూడా 2001 నుండి ఎక్కువయ్యాయన్నారు. జమ్మూ - కాశ్మీర్ తర్వాత ఉగ్రవాదుల కన్ను మన రాష్ట్రం పైనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ పోలీస్ ఫోర్స్ కావాల్సి ఉంటుందన్నారు. విభజన జరిగితే నలభై శాతం పోలీస్ ఫోర్స్ పెరుగుతుందన్నారు. విభజన జరగకుంటే పోలీసు సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడదన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరినట్లు చెప్పారు.
సాగునీరు
విభజన జరిగితే సాగునీరు అతి పెద్ద సమస్య అవుతుందన్నారు. ట్రైబ్యునల్ ఉన్నా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో వివాదాలు ఉన్నాయని చెప్పారు. ట్రైబ్యునల్ ఆదేశం మేరకు మిగులు జలాల వినియోగానికి ప్రాజెక్టులు ప్రతిపాదించామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కింద 74 లక్షల ఎకరాలను సాగులోకి తెస్తున్నామన్నారు. పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తి కాబోతుందన్నారు. విభజిస్తే ప్రాజెక్టులు, నీటి సమస్యలు వస్తాయన్నారు.
విభజన జరిగితే నదీ జలాలను రెండు రాష్ట్రాలు పంచుకునే పరిస్థితి ఏర్పడుతుందని, కలిసుంటే సమన్వయంగా పంచుకోవచ్చునన్నారు. కృష్ణా కింద నాగార్జున సాగర్, డెల్టా ద్వారా ఆంధ్రలో 32 లక్షల ఎకరాలు, తెలంగాణలో 20 లక్షల ఎకరాలు సాగు జరుగుతోందన్నారు. మిగులు జలాల వినియోగం సమస్య వస్తే పరిష్కరించేందుకు ఎలాంటి బోర్డులు లేవన్నారు. వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు.
విభజన జరిగితే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం నీటిని కేటాయించుకునే అవకాశం కోల్పోతుందన్నారు. కలిసి ఉంటే నీటిని కేటాయించుకోవచ్చునని తెలిపారు. ఎగువ ప్రాంతమైనందున తెలంగాణ మిగులు జలాలపై హక్కు కోల్పోతుందన్నారు. తద్వారా 11 లక్షల ఎకరాలకు తెలంగాణ సాగునీరు కోల్పోతుందన్నారు. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాలు కలిసి ఉండాలని ఫజల్ అలీ కమిషన్ చెప్పిందన్నారు.
విభజన ద్వారా సాగునీటి సమస్యలు తలెత్తితే అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందన్నారు. దమ్ముగూడెం వంటి ప్రాజెక్టులు పూర్తయితే నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నీళ్లు అందించవచ్చునన్నారు. జలయజ్ఞ కింద 65వేల కోట్ల రూపాయలు తెలంగాణలో, ముప్పైవేల కోట్ల రూపాయలు సీమాంధ్రలో ఖర్చు చేయాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications