గేమింగ్ పార్క్కు సిఎం శంకుస్థాపన: హరీష్ రావు అరెస్టు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాదు నగరంలోని రాయ్దుర్గ్లో గేమింగ్ యానిమేషన్ పార్క్కు శంకుస్థాపన చేశారు. గతంలో తమకు కేటాయించిన భూములను గేమింగ్ సిటీకి ఎలా కేటాయిస్తారని ముఖ్యమంత్రిని కంపెనీల ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొన్నాల ప్రసంగిస్తుండగా ముఖ్యమంత్రి, మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎపిపిఐసి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
సర్వే నెం. 83 భూమిలో గేమింగ్ పార్క్కు అనుమతి ఇవ్వడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు హరీష్రావు, రాజయ్య, జూపల్లి కృష్ణారావు తదితరులు నిరసన వ్యక్తం చేశారు. వారు ప్రారంభోత్సవానికి అడ్డుకోడానికి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు ముందు జాగ్రర్త చర్యగా వారిని అరెస్టు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారసత్వ సంపదగా వస్తున్న 30 ఎకరాల భూములను యానిమేషన్ గేమింగ్ పార్క్కు కేటాయించారని ఆరోపిస్తూ తెలంగాణ నేతలు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, మంత్రి పొన్నాలపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.
రేపోమాపో తెలంగాణ ఏర్పడే ఈ సమయంలో కూడా తెలంగాణలోని విలువైన భూములను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రులకు కట్టబెడుతున్నాడని ఎమ్మెల్యే హరీష్రావు ఆరోపించారు. హెరిటేజ్ ప్రాపర్టీని కాపాడాల్సిన ముఖ్యమంత్రే భూదందా చేస్తున్నాడని ధ్వజమెత్తారు. కిరణ్ రెడ్డి పాలన పోలీస్ రాజ్యంగా నడుస్తోందని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా రాయదుర్గం సర్వేనంబర్ 83/1లో హెరిటేజ్ భూముల్లో గేమింగ్ పార్క్ పేరుతో శంకుస్థాపన చేయాలనుకున్న ముఖ్యమంత్రికి ఈ భూములపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ విచారణ జరుపుతున్న సంగతి తెలియదా అని హరీష్రావు ప్రశ్నించారు.