ఏక్షణమైనా కిరణ్ రాజీనామా, పార్టీ?: అధిష్టానం ఆగ్రహం
న్యూఢిల్లీ: విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏక్షణమైనా పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. బుధవారం జంతర్మంతర్ వద్ద ధర్న అనంతరం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తెలంగాణ బిల్లుపై చర్చించనున్నారు. బిల్లును పార్లమెంటుకు పంపించాలా? వద్దా? అనే అంశంపై ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రణబ్ చెప్పే పక్షంలో కిరణ్ మరిన్ని రోజులు వేచి చూస్తారంటున్నారు.
తెలంగాణ బిల్లును పార్లమెంటుకు పంపించనున్నట్టు ప్రణబ్ సంకేతాలు ఇస్తే మాత్రం కిరణ్ గురువారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాదుకు చేరిన వెంటనే పదవికి రాజీనామా చేయవచ్చునని ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికలు, ఓట్ ఆన్ అకౌంట్ తదితర అంశాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఇక పదవిలో కొనసాగి లాభం లేదనే నిర్ణయానికి కిరణ్ వచ్చారంటున్నారు.

కాగా, కిరణ్ వ్యాఖ్యలను బట్టి ఆయన కొత్త పార్టీ స్థాపించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటుకు పంపిస్తానని ప్రణబ్ సంకేతాలు ఇవ్వగానే కిరణ్ హైదరాబాద్ వచ్చి రాజీనామా చేసిన అనంతరం... పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో కొత్త పార్టీని ప్రకటించే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
మరోవైపు యూపిఏ సంకీర్ణ ప్రభుత్వం తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించిన మరుక్షణం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పోతానని కిరణ్ ఒక టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించటం గమనార్హం. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటు పరిశీలనకు వచ్చే ప్రసక్తే లేదని కిరణ్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ తిరస్కృతికి గురైన బిల్లును రాష్టప్రతి ఆమోదిస్తారని తాము అనుకోవడం లేదన్నారు.
తాను రాష్ట్ర ప్రజల తరపున పోరాడుతున్నానని, దాదాపు ఎనభై శాతం ప్రజలు సమైక్యాంధ్రనే కోరుతున్నారన్నారు. లోపభూయిష్టమైన బిల్లును రాష్టప్రతి ఆమోదించరని అంటూనే, అసెంబ్లీ తిరస్కృతికి గురైన బిల్లును ఆమోదిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన దాదాపు తొమ్మిదివేల సవరణలపై అసెంబ్లీలో చర్చ జరగలేదన్నారు. కేంద్రం తెలంగాణ ప్రతినిధిగా వ్యవహరిస్తోంది తప్ప మెజారిటీ అభిప్రాయాన్ని పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు.
అసెంబ్లీ తిరస్కరించిన సందర్భంలో విభజనపై ముందుకెళ్లిన సంఘటన గతంలో ఎప్పుడూ లేదన్న విషయం మర్చిపోకూడదన్నారు. ముఖ్యమంత్రి పదవి పోయినా సరే, విభజనను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. న్యాయపరమైన సమస్యలు ఉన్నందున తెలంగాణ బిల్లు పార్లమెంటులో చర్చకు రానేరాదన్నారు. తనకు ప్రజలు ముఖ్యం కానీ పదవి కాదని కిరణ్ ప్రకటించారు. మరోవైపు, ధర్నాకు దిగవద్దని అధిష్టానం కిరణ్కు నచ్చ చెబుతూనే, ఆయన పట్ల ఆగ్రహం, అసంతృప్తితో ఉంది.












Click it and Unblock the Notifications