అంగీకరిస్తే మరో మూణ్నెళ్లు ఉండేవాడిని: కిరణ్ రెడ్డి

తమ పార్టీని కాంగ్రెసులో కలపబోనని, తాను విభజనను వ్యతిరేకించే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. అధిష్ఠానం చెప్పినట్టు విభజనకు అంగీకరిస్తే ఇంకో మూడు నెలలు సీఎంగా వుండేవాడినని, ఆ తరువాత ఏ రాష్ట్రానికో గవర్నర్గా వెళ్లేవాడిని అన్నారు. జగన్, చంద్రబాబులు సీఎం పదవి కోసం పోరాడుతున్నారని, తాను సమైక్యాంధ్ర కోసం ఆ పదవిని వదులుకున్నానని, ఈ విషయాన్ని అంతా గుర్తించాలని కిరణ్ రెడ్డి అన్నారు.
ఉడుకు రక్తంతో సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వారికి అండగా నిలిచేందుకు, వారి తరపున పోరాటం కొనసాగించేందుకు, తెలుగు జాతి ఆత్మాభిమానం కోసం, జై సమైక్యాంధ్ర నినాదంతో వచ్చామని చెప్పారు. అదే పౌరుషంతో రాష్ట్రం విడిపోవడానికి కారణమైన పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇది వారికి చెంపదెబ్బ కావాలని కిరణ్కుమార్రెడ్డి అన్నారు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక్క అవకాశమే ఉన్నదని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర పార్టీలకు ఓట్లు వేస్తే పౌరుషం లేనట్టేనని వ్యాఖ్యానించారు.
శ్రీకాకుళం జిల్లాలోని పలాస, శ్రీకాకుళంలలో నిర్వహించిన రోడ్ షోలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టు స్టే ఇస్తుందని, ఆ తర్వాత పార్లమెంటు, అసెంబ్లీల్లో ఈ అంశం మళ్లీ చర్చకు వస్తుందని, ఓటింగ్ జరుగుతుందని, అప్పుడు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి ఓడించాలంటే మద్దతిచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండాలని ఆయన అన్నారు. అందుకే ప్రజలు ఆలోచించి తమ చేతితో చెప్పుల గుర్తుకు ఓటు వేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications