విభజనకు నిరసన: ఢిల్లీలో సిఎం కిరణ్ రెడ్డి ధర్నా
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు నిరసనగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. శాసనసభ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకూడదని ఆయన డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పి. అశోక్ బాబు నేతృత్వంలోని ఎపి ఎన్జీవోల సంఘం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించే అలోచనలో ఉంది.
ఎపి ఎన్జీవోలు నిర్వహించే ధర్నా కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి బైఠాయిస్తారని అంటున్నారు. కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో కూర్చునే అవకాశాలున్నాయి. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎపి ఎన్జీవోలు ఢిల్లీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తారని అంటున్నారు.
పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించడానికి ముందే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఎపి ఎన్జీవోల సంఘం నాయకులు ప్రయత్నాలు చేయనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో బిల్లును ఓడించడానికి సమైక్యంగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెసు సీమాంధ్ర నాయకులున్నారు.
ఢిల్లీ ధర్నాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొంటే యుపిఎ ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందని, దాంతో బిల్లుకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న బిజెపి వెనక్కి తగ్గే అవకాశాలు కూడా ఉంటాయని భావిస్తున్నారు. సీమాంధ్రలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో సమైక్యాంధ్ర పరుగు చేపట్టాలని కూడా అనుకుంటున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా, లేదా అనే విషయం కూడా ఫిబ్రవరిలో తేలుతుందని అంటున్నారు. పార్లమెంటులో బిల్లు పరిస్థితి చూసిన తర్వాత ఆయన తన కొత్త పార్టీ గురించి ప్రకటన చేస్తారని అంటున్నారు.