కిరణ్ తన మాటే తాను వినరు: విభజనపై లగడపాటి
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఒక్కసారి కట్టుబడిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తన మాట తానే వినరని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాలో శనివారం ఏర్పాటైన రచ్చబండ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సమైక్యాంధ్ర కోసం కిరణ్ కుమార్ రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు.
విభజన జరిగితే రాష్ట్రం రగిలిపోతుందని, తెలుగుజాతి గుర్తింపు లేకుండా పతనమవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదనతో రగిలిపోతున్నారని ఆయన అన్నారు. సమైక్య ఉద్యమం వంద రోజులతో ముగిసి పోలేదని, ముందు ముందు అసలు ఉద్యమం ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ట్రైలర్ మాత్రమే చూశామని, ఇక అసలు ఉద్యమం చూస్తామని ఆయన అన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమం ఆగిపోలేదని, ప్రతి గుండె రగిలిపోతోందని ఆయన అన్నారు. విభజన జరిగితే చుక్క నీరు కూడా రాదని రైతులు ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే సత్తా కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరికే ఉందని మంత్రి పార్థసారథి అన్నారు.
సమైక్యాంధ్ర కోసం కట్టుబడిన నేత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమేనని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రికి ప్రజల మద్దతు కావాలని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో సమైక్య గళం వినిపించిన విషయం తెలిసిందే. సమైక్యాంధ్ర కోసం తాను పదవీ త్యాగానికైనా సిద్ధమని ఆయన చెప్పారు. కేంద్రాన్ని, పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించే రీతిలో ఆయన ప్రసంగించిన విషయం కూడా తెలిసిందే. దీంతో కృష్ణా జిల్లాలోని రచ్చబండ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications