అమ్మను చూసి జగన్ పిల్లిలా దాక్కున్నారు: లగడపాటి
తిరుపతి: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సమైక్య ఉద్యమంలో విజయం సాధిస్తారని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆత్మవిశ్వాసమే కిరణ్ కుమార్ రెడ్డికి రక్ష అని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం గాంధేయ పద్ధతిలో సాగుతోందని, గాంధేయ పద్ధతి నుంచి గాండీవ పద్ధతికి చేరుకునే అవకాశం ఉందని, అయితే గాండీవ పద్ధతి అవసరం లేకుండానే రాష్ట్ర విభజన ఆగిపోతుందని అనుకుంటున్నామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అర్జునుడో, అభిమన్యుడో త్వరలోనే తేలిపోతుందని ఆయన అన్నారు. విభజన జరగకపోతే కిరణ్ రెడ్డి హీరో అని, జరిగితే జీరో అని ఆయన అన్నారు. విభజన జరిగితే కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉండకపోవచ్చునని ఆయన అన్నారు.
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని చూసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిల్లిలా దాక్కున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సమైక్య తెగువను మాటల్లో కాదు, చేతల్లో చూపించాలని ఆయన అన్నారు. ఫిబ్రవరి వరకు విభజన ప్రమాదం ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ సమన్యాయం పేర రాజకీయం చేస్తోందని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజనకు తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న మరుక్షణం నుంచి ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి వరకు కాంగ్రెసులో వ్యతిరేకిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. విభజనకు పెద్దల ఒప్పందం కాదు, ప్రజల ఒప్పందం కావాలని చెప్పామని ఆయన అన్నారు. ప్రజల సమ్మతి లేని నిర్ణయాలు చేసే పార్టీలకు కాలం చెల్లుతుందని కూడా చెప్పామని ఆయన అన్నారు. ఇతర పార్టీల పెద్దలు వస్తారని ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా ప్రజల అభిప్రాయానికి భిన్నంగా కాంగ్రెసు అధిష్టానం విభజనకు నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు.

ఇక రెండు నెలల వ్యవధి మాత్రమే ఉందని, శాసనసభా పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి చివరి వరకు మాత్రమే సాగుతాయని, ఆ తర్వాత ఎన్నికలు వస్తాయని, ఈ రెండు నెలలు ఆపగలిగితే విభజన ఆగిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జనవరి మధ్యలో మరింత గడువు కావాలని రాష్ట్రపతిని కోరుతారని ఆయన అన్నారు. శాసనసభలో బిల్లును ఓడిస్తే కచ్చితంగా విభజన రాష్ట్రపతి వద్ద ఆగిపోయే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
రాష్ట్రపతి యాభై ఏళ్ల రాజకీయానుభవం ఉన్న వ్యక్తి అని, రబ్బర్ స్టాంపులా వ్యవహరిస్తున్నారని అనేవారికి ఇది వరకే రాష్ట్రపతి సమాధానం చెప్పారని, అసెంబ్లీలో బిల్లుపై చర్చకు జనవరి 23వరకు రాష్ట్రపతి గడువు ఇవ్వడంతో అందరి నోళ్లూ మూతపడ్డాయని ఆయన అన్నారు. సీమాంధ్ర శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులంతా సమైక్యానికి కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనకు నిర్ణయం వచ్చిన తర్వాత తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తిరుగుబాటు రాలేదని, కాంగ్రెసులో మాత్రమే వచ్చిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications