సీమాంధ్రVsతెలంగాణ మంత్రులు: కిరణ్ రెడ్డియే కీలకం
హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న మంత్రుల బృందం(జివోఎం) సోమవారం తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రులు, సమాంధ్ర కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలను తీసుకోనుంది. 11 విధి విధానాల పైన నెల రోజులకు పైగా కసరత్తు చేస్తున్న జివోఎం టి, సీమాంధ్ర కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి చివరి వాదనలను విననుంది. ఇందుకోసం ఇప్పటికే ఎవరి వ్యూహాలు వారు సిద్ధం చేసుకున్నారు.
సోమవారం ఉదయం పది గంటలకు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, 11 గంటలకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, 12.30 గంటలకు ముఖ్యమంత్రితో జివోఎం భేటీ అవుతుంది. తెలంగాణ తరఫున జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, సీమాంధ్ర తరఫున కావూరి సాంబశివ రావు, చిరంజీవి, పళ్లంరాజు, పురందేశ్వరి, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణి జివోఎంను కలిసి తమ తమ ప్రాంతాల డిమాండ్లను వినిపించనున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి జివోఎం ముందు వినిపించాల్సిన డిమాండ్లపై కసరత్తు చేశారు. ఈ మేరకు ఒక నివేదికను కూడా తయారు చేశారు. గోదావరి నదిపై ఎలాంటి బోర్డూ అవసరం లేదని, కేవలం కృష్ణా నదిపై బోర్డును ఏర్పాటు చేస్తే సరిపోతుందని, తెలంగాణకు అవసరమయ్యే విద్యుత్ను కేంద్రం కేటాయించాలని, హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిని ఉమ్మడి రాజధాని చేయాలని, భద్రాచలంను తెలంగాణలోనే కొనసాగించాలని, తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా సీమాంధ్ర ప్రజల డిమాండ్లను నెరవేర్చాలని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
సీమాంధ్ర కేంద్ర మంత్రులు సోమవారం ఉదయం 9 గంటలకు పళ్లం రాజు నివాసంలో భేటీ కానున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి ఏమేం చేయాలో వివరిస్తూ గతంలోనే వీరంతా షిండే సహా జివోఎం సభ్యులకు, ప్రధానికి వినతి పత్రాలు సమర్పించారు. హెచ్ఎండిఎ పరిధిగా హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్నదే వీరి ప్రధాన డిమాండ్. 1956 నాటికి సీమాంధ్రలో ఉన్న భద్రాచలం డివిజన్ను తిరిగి సీమాంధ్రకు ఇచ్చేయాలని కోరుతున్నారు.
సీమాంధ్రకు భారీ ఆర్థిక ప్యాకేజ్ను కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రం తమతో జరిపే చివరి సమావేశం ఇదే కనక ఆఖరి పోరాటం చేయక తప్పదని, అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవాలని సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేయాలని కుదరకపోతే, హెచ్ఎండిఎ పరిధిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు గట్టిగా పట్టుబట్టాలని ఎంపీలు నిర్ణయించారు.
లేకపోతే రాజీనామాల ఆమోదానికి ఒత్తిడి చేయాలంటూ కేంద్ర మంత్రులను గట్టిగా కోరాలని భావిస్తున్నారు. తాము మాత్రం పార్లమెంట్ సమావేశాల మొదటి రోజే రాజీనామాలను ఆమోదించాలంటూ స్పీకర్ను నిలదీస్తామని, దీంతో, ఆమెకు తమ రాజీనామాలు ఆమోదించక తప్పదని ఒక ఎంపీ చెప్పారు.
రాష్ట్ర విభజన పిటిషన్లపై తుది వాదనలు నేడే
రాష్ట్ర విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం తుది వాదనలు జరగనున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన చెందిన సోమయాజులు, రఘురామ కృష్ణం రాజు, టిడిపి నాయకులు పయ్యావుల కేశవ్, కె కృష్ణమూర్తి, కె ప్రభాకర్ రాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సంఘం, అనిశెట్టి చంద్ర మోహన్, రామకృష్ణ వేర్వేరుగా వివిధ పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తులు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి లోకూర్లతో కూడిన ధర్మాసనం ఆయా పిటిషన్లను విచారించనుంది.












Click it and Unblock the Notifications