కిరణ్ నోటీస్పై కిశోర్: రాజ్యసభ నుండి తప్పుకున్న జెసి
విశాఖ/హైదరాబాద్: శాసన సభకు ఏ బిల్లు అయినా ముసాయిదా రూపంలోనే వస్తుందని కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ మంగళవారం అన్నారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ముసాయిదా బిల్లుకు శాసన సభ సవరణలు ప్రతిపాదించవచ్చునని తెలిపారు. బిల్లును తిప్పి పంపించాలన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు పైన రాజ్యాంగపరంగా వెసులుబాటును పరిశిలించాలని సూచించారు.

సభాపతిదే బాధ్యత
సభ్యుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసన సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. మంగళవారం సభ వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సభ్యుల అభిప్రాయాలను ఓటింగ్ ద్వారానే తెలుసుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సభలో ఏం చెప్పాలో చెప్పడానికి జైరాం రమేష్ ఎవరని ప్రశ్నించారు.
రాజకీయ వైరుధ్యాలు పక్కన పెట్టి సమైక్యాంధ్ర కోసం పోరాడుదామని పయ్యావుల కేశవ్ సూచించారు. జగన్ పార్టీ పెట్టిన తీర్మానాన్ని కూడా తాము సమర్థించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సమైక్యం కోసం ఏమైనా చేస్తామన్నారు. తమ బాటలోకి వచ్చారని జగన్ పార్టీ నేతలు టిడిపిని ఉద్దేశించి చెప్పడం సరికాదన్నారు. బిల్లుపై చర్చ వద్దని చర్చలో, సవరణలు వద్దని సవరణలు ప్రతిపాదించారని విమర్శించారు.
తప్పుకున్న జెసి
రాజ్యసభ బరి నుండి జెసి దివాకర్ రెడ్డి తప్పుకున్నారు. శాసన మండలి సభ్యులు చైతన్య రాజు మంగళవారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట జెసి, కన్నబాబు తదితరులు ఉన్నారు. సోమవారం రాత్రి జెసి, చైతన్య రాజుల పేర్లు తెర పైకి వచ్చినప్పటికీ ఎవరో ఒకరే పోటీ చేసే అవకాశముందని నిన్ననే చెప్పారు. చైతన్య రాజు కాంగ్రెసు రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మరోవైపు తెరాస అభ్యర్థి కె కేశవ రావు నామినేషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications