జగన్పై కత్తితో దాడి: కేటీఆర్, హరీశ్, కవిత, రామ్మోహన్నాయుడు, గంటా.. స్పందన
హైదరాబాద్: విశాఖపట్నం విమానాశ్రయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేశ్ప్రభు, ఏపీ మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాడిని తీవ్రంగా ఖండించారు.
Recommended Video
విశాఖ ఎయిర్పోర్టులో వైయస్ జగన్పై కత్తితో దాడి: రక్తంతో తడిసిన షర్ట్, రోజా వార్నింగ్, కంటతడి
జగన్ త్వరగా కోలుకోవాలని.. కేటీఆర్
టీఆర్ఎస్ నేత, తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కూడా దాడిపై స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
దాడిపై ఉత్తమ్ స్పందన
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి కూడా దాడిపై విచారం వ్యక్తం చేశారు. ‘వైజాగ్ ఎయిర్పోర్టులో జగన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై తక్షణమే దర్యాప్తు జరగాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు చోటు లేదు. జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అని ఉత్తమ్ ట్వీట్ చేశారు.
హింసకు తావులేదంటూ కవిత..
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో హింసకు తావులేదని ఆమె అన్నారు. భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మంత్రి గంటా స్పందన
జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
రామ్మోహన్నాయుడు స్పందన
వైయస్ జగన్పై జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు తెలిపారు. హింస ఏ సమస్యకూ పరిష్కారం కాదని అన్నారు.
హరీశ్ రావు స్పందన
‘ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన త్వరగా కోలుకొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దాడికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి' అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.