భువనేశ్వరిని అమ్మా అంటా, హైదరాబాద్లో తేల్చుకుందాం రా: బాబుకు నాని సవాల్
విజయవాడ: స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబం అంటే తనకు గౌరవం అని, ఆ కుటుంబంలో అందర్నీ తాను గౌరవిస్తానని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని తాను ఏమీ దూషించలేదని, ఆమెను ఇప్పటికీ అమ్మ అని అంటానని వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు.
ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. గుడివాడలో వైసిపి కార్యాలయాన్ని ఖాళీ చేయించిన విషయంలో చంద్రబాబు కుటుంబసభ్యుల హస్తం ఉందన్నానే కానీ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై నేను ఎటువంటి విమర్శలు చేయలేదన్నారు. ఆమెను దూషించలేదన్నారు.
ఇటీవల గుడివాడ సమీపంలోని ఆము గ్రామానికి భువనేశ్వరి వచ్చిన సందర్భంలో తాను కార్యాలయం విషయం ప్రస్తావించానని చెప్పారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల హస్తం ఉందని తాను చెప్పడానికి కారణం లేకపోలేదన్నారు.
గుడివాడ వైసిపి కార్యాలయంలో సామాన్లను దౌర్జన్యంగా బయటపడేసిన వారిలో నిమ్మకూరుతో బాటు, మరో గ్రామానికి చెందిన వ్యక్తులున్నారన్నారు. అందుకే, తాను ఈ వ్యాఖ్యలు చేశానన్నారు. తమ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించిన మీరు దానిని ఏం చేసుకుంటారని ప్రశ్నించారు.
వైసిపి నేతలపై రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబు సర్కారు కేసులు పెట్టి జైళ్లకు పంపుతోందని, ఈ విషయంలో చంద్రబాబు తన తప్పు లేదని భావిస్తే చర్చకు రావాలని నాని సవాల్ చేశారు. హైదరాబాద్లో చర్చకు సిద్ధం కావాలని, అక్కడి పోలీసులు తెలంగాణ వారు కాబట్టి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్నారు.
దమ్ముంటే హైదరాబాద్లో చర్చకు సిద్ధమై వస్తే, తేల్చుకుందామన్నారు. అధికారుల వేధింపులకు నిరసనగా ధర్నా చేపట్టిన తమ పార్టీ నేత పేర్ని నానిపై మూడు కేసులు బనాయించారని, తన పార్టీ కార్యాలయం ఖాళీ చేయించే పేరిట పోలీసులను ఉసిగొల్పారన్నారు. విపక్షాలపై చంద్రబాబు సర్కారు వైఖరికి వ్యతిరేకంగా పోరు తీవ్రతను మరింతగా పెంచుతామన్నారు.