విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి లేఖపై లోకేష్ వ్యాఖ్యలు .. మోడీని కాలర్ పట్టుకుని లోకేష్ అడగాలన్న కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళన తీవ్ర రూపం దాలుస్తుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం మహాగర్జనకు సర్వం సిద్ధమైంది. ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాస రావు ఆత్మహత్య చేసుకుంటా అంటూ రాసిన లేఖ కలకలం రేపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వద్దని , ఈరోజు జరగబోయే కార్మిక మహాగర్జన ఒక మైలురాయిగా నిలిచి పోవాలి అని నేను నా ప్రాణాన్ని ఉద్యమం కోసం త్యాగం చేస్తున్నానని ఈరోజు ఫర్నేస్ లో అగ్నికి ఆహుతి కావడానికి సాయంత్రం 5 గంటల 49 నిమిషాలు ముహూర్తంగా నిర్ణయించుకున్నానని శ్రీనివాసరావు అనే ఉద్యోగి రాసిన లేఖ నేపద్యంలో పోలీసులు శ్రీనివాసరావు కోసం గాలింపు చేపట్టారు.

జగన్ రెడ్డి కేంద్రం కాళ్ళ మీద పడటం వల్లే కార్మికుల ఆత్మహత్య
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఆత్మహత్య లేఖ కలకలంపై కూడా అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది . టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఆత్మహత్య లేఖ విషయంలో వైసీపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల మాఫీ కోసం జగన్ రెడ్డి కేంద్రం ప్రజల కాళ్ళ మీద పడటం వల్లే ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

విశాఖ ఉక్కుని కొట్టేసే ప్రయత్నాన్ని జగన్ రెడ్డి ఇప్పటికైనా ఆపాలన్న లోకేష్
స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు లేఖ ను చూస్తే బాధేస్తోంది పేర్కొన్న లోకేష్, కార్మికులకు ప్రాణత్యాగాలు చేసే నిర్ణయం తీసుకోవద్దంటూ చేతులెత్తి వేడుకుంటున్నా అంటూ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి టిడిపి దేనికైనా సిద్ధంగా ఉంటుందన్నారు లోకేష్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తాము కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని లోకేష్ వెల్లడించారు. విశాఖ ఉక్కుని కొట్టేసే ప్రయత్నాన్ని జగన్ రెడ్డి ఇప్పటికైనా ఆపాలని, కార్మిక కుటుంబాల్లో నెలకొన్న ఆందోళనను జగన్ రెడ్డి అర్థం చేసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.

లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఫైర్
ఇదిలా ఉంటే స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఆత్మహత్య లేఖ విషయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు . స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని ,అది ప్రభుత్వం చేతిలో ఉండాలని చెప్పి ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు కొడాలి నాని. మీకు దమ్ము , ధైర్యం ఉంటే ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించాలని కొడాలి నాని లోకేష్ పై మండిపడ్డారు. వర్ధంతికి జయంతికి తేడా తెలియని వ్యక్తి లోకేష్ అని వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన వ్యక్తికి సీఎం గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడని విమర్శించారు.

నరేంద్రమోడీని కాలర్ పట్టుకుని ప్రశ్నించాలన్న కొడాలి నాని
లోకేష్ కు దమ్ముంటే కేంద్రంలో ఉన్న నరేంద్రమోడీని కాలర్ పట్టుకుని ప్రశ్నించాలని కొడాలి నాని హితవు పలికారు . చంద్రబాబు మాయ మాటల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చిక్కుకోవద్దు అని పేర్కొన్న కొడాలి నాని ఆఖరకు స్టీల్ ప్లాంట్ కార్మికుడి ఆత్మహత్య అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని లోకేష్ ప్రయత్నిస్తున్నాడు అంటూ మండిపడ్డారు.
అధికార వైసీపీ కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని కొడాలి నాని పేర్కొన్నారు . లోకేష్ కు స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ ఎలా సర్టిఫికెట్ ఇచ్చిందో లేఖ రాస్తానన్నారు. లోకేష్ నాడు రామలింగరాజు దాబుతో చదివాడని , అయినా లోకేష్ కు బుర్ర లేదన్నారు కొడాలి నాని .












Click it and Unblock the Notifications