రోజాను, నన్ను టార్గెట్ చేశారు, జగన్ గంగలో దూకితే నేను దూకుతా: కొడాలి నాని
విజయవాడ: తెలుగుదేశం పార్టీ తనను, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రోజా, భూమా నాగిరెడ్డిలను లక్ష్యంగా పెట్టుకుందని గుడివాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని సోమవారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడ వైసిపి కార్యాలయం అద్దె విషయమై గొడవ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
దీనిపై కొడాలి నాని స్పందించారు. తమ ముగ్గురిని టిడిపి లక్ష్యంగా చేసుకుందన్నారు. భూమాపై అనవసర కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శిస్తున్నందుకే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తాట తీస్తానని వ్యాఖ్యానించిన తర్వాతే, నేను సీఎం చంద్రబాబు పైన విమర్శలు చేయడం ప్రారంభించానని తెలిపారు. జగన్ను కించపరిచేలా మాట్లాడితే, చంద్రబాబును కూడా విమర్శిస్తానని గతంలోనే చెప్పానన్నారు.
అయినా దేవినేని ఉమా తన తీరు మార్చుకోలేదన్నారు. దీంతో, తాను తాను చంద్రబాబును విమర్శిస్తున్నానన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తర్వాత తనకు జగన్ అత్యంత ఆప్తుడన్నారు. జగన్ నాయకత్వ లక్షణాలు చాలా గొప్పవన్నారు. ఇతరులను ఆయన గౌరవించే తీరు స్ఫూర్తిదాయకమన్నారు.
తాను రాజకీయంగా బలహీనపడలేదని, ఇతర పార్టీల్లోకి వెళ్లే ఆలోచన కూడా లేదన్నారు. తన తుది శ్వాస వరకు వైసిపిలోనే ఉంటానని చెప్పారు. జగన్ గంగలోకి దూకితే తాను కూడా దూకుతానని చెప్పారు. రానున్న రోజుల్లో తమ చూపిస్తామన్నారు.