పవన్ కళ్యాణ్ విమర్శలు బీజేపీపైనే.. ఏపీ సర్కారుపై కాదు: కొడాలి నాని విమర్శలు
కృష్ణా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై, బీజేపీపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్కు రాజకీయాలపై అవగాహన లేదని అన్నారు. హిందుత్వంపై బీజేపీకి నిజమైన గౌరవం ఉంటే అంతర్వేది సహా పలు ఘటనలపై సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్కు సినిమాలు తప్ప.. రాజకీయాలు ఆసక్తిలేదు
నందివాడలో టీడీపీ తరపున జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దాసరి మేరీ విజయకుమారి మంత్రి కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్కు సినిమాలు తప్ప రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనని, ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నేతలు గతంలో వైఎస్ జగన్, అతడికి సంబంధించిన వ్యక్తులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ విమర్శలు బీజేపీనుద్దేశించే..
సీబీఐ పరిధిలో ఉన్న కేసును ఎవరు దర్యాప్తు చేయాలని ప్రశ్నించారు. తిరుపతిలో ఎన్నికల ప్రచార వేదికపై పవన్ ఆరోపణలు చేసింది తమపై కాదని.. బీజేపీని ఉద్దేశించేనని అన్నారు కొడాలి నాని.బీజేపీకి దేవుళ్లు, గుడులపై నమ్మకముంటే అంతర్వేదిలో రథం దగ్ధమైతే కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు ఆశించలేదు? అని కొడాలి నాని నిలదీశారు. ఈ విషయంలో సీబీఐ విచారణ వేసి నిందితులను పట్టుకోవాలని కేంద్రాన్ని పవన్ ఎందుకు ప్రశ్నించలేదని లేదని కొడాలి నాని నిలదీశారు.
అప్పుడు విమర్శించి ఇప్పుడు మద్దతా?
మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మతాన్ని అడ్డుపెట్టుకుని విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీని విమర్శించిన వ్యక్తే ఇప్పుడు మద్దతు తెలపడం శోచనీయమన్నారు. మత ప్రేరణలతో అధికారపక్షాన్ని ఓడించాలనే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు నీచ సంస్కృతికి పాల్పడుతున్నాయని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆలయాలను కూల్చిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ హస్తముందని ఆరోపించారు. తిరుపతి ప్రశాంతతకు భంగం కలిగించొద్దని అన్నారు.