తెలంగాణ వచ్చేదాకా క్లాస్లకు కోదండరాం దూరం
హైదరాబాద్: తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేదాకా విధుల్లో చేరరాదని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం నిర్ణయించుకున్నారు. ఈ నెల 20వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిపోర్ట్ చేసి, తిరిగి విధుల్లో చేరాలని యోచించిన ఆయన మనసు మార్చేసుకున్నారు.
బిల్లుపై సభలో రోజుకొక పరిణామం జరుగుతుండటం, ఉమ్మడి రాజధాని, గవర్నర్ చేతికి శాంతిభద్రతలు వంటి అంశాలు తెలంగాణవాదులను కలవరపెడుతుండటంతో మళ్లీ పోరుబాట పట్టాలని ఆలోచిస్తున్నారు. విధుల్లో చేరి, అటు వృత్తికి, ఇటు ప్రవృత్తికి మేలు చేయలేమని నిర్ణయించుకున్న ఉద్యమ క్షేత్రంలోనే ఉండాలని భావిస్తున్నారు. తెలంగాణ ఐకాసతో పాటు రాజకీయ ఐకాస చైర్మన్గా 2009లో బాధ్యతలు చేపట్టిన కోదండరాం, 2010 నుంచి కాలేజీకి దూరమయ్యారు. బిల్లు ఆమోదించాకా, రాష్ట్రపతి గెజిట్ విడుదలయ్యాకే విధుల్లో చేరాలని ఆయన భావిస్తున్నారట.
కాగా, అసెంబ్లీ అభిప్రాయాల కోసం రాష్ట్రపతి పంపించిన రాష్ట్ర విభజన బిల్లును వెనక్కి పంపించాలని కోరుతూ స్పీకర్కు నోటీసు ఇవ్వటం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని కోదండరాం విమర్శించారు. కిరణ్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగబద్ధ ప్రక్రియ అని, అది ప్రజాస్వామ్యయుతంగా మొదలైందని, రాష్ట్రపతి అసెంబ్లీకి పంపించిన బిల్లుపై అభిప్రాయాలు వ్యక్తీకరించాలే తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి పంపిస్తామని, చించేస్తామని, రాష్ట్రం ఇవ్వకూడదని అనే అవకాశం లేదని చెప్పారు.
సిఎం తీరు ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధమని, తెలంగాణను అడ్డుకోవటానికి ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారేమో ఆయన చర్య దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికి నష్టదాయకమన్నారు. అందరినీ నడిపించే రాజ్యాంగానికి తూట్లు పొడవటం అనర్థమని గ్రహించాలని, కిరణ్కు సీమాంధ్ర నేతలు సహకరించవద్దని కోరారు. సిఎం రాజ్యాంగ వ్యతిరేక చర్యను తెలంగాణ ప్రజాప్రతినిధులంతా తిప్పికొట్టాలని, రాజ్యాంగంపైన మ్మకం ఉన్న సీమాంధ్ర నేతలకూ ఈ బాధ్యత ఉందన్నారు.