దినేష్రెడ్డి పీడ విరగడైంది, ఫిరంగులు పేల్తాయి: కోదండ
బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి మాట్లాడటానికి ముందు కోదండరామ్ మైక్ తీసుకొని ఇక్కడ రెండు ఫిరంగులు పేలనున్నాయని, అవి ఒకటి నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. మరో ఫిరంగిని తర్వాత చెబుతానన్నారు. అది తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్దేశించి అని ఉంటారు.
తెలంగాణ అంటేనే పొత్తు: యెండల
భవిష్యత్తులో తాము ఎవరితో పొత్తులు పెట్టుకోమని ఒకవేళ పెట్టుకున్నా అది తెలంగాణకు అనుకూలంగా ఉన్న వారితోనే ఉంటుందని భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత యెండల లక్ష్మీ నారాయణ అన్నారు. సిడబ్ల్యూసి కమిటీ నిర్ణయించిన విధంగా తెలంగాణ ఏర్పాటు చేస్తే మద్దతిస్తామని తమ పార్టీ అగ్ర నేత సుష్మా స్వరాజ్ చెప్పారన్నారు.
కాంగ్రెసు తెలంగాణ ఇవ్వకుంటే ఆమె స్వయంగా ఉద్యమంలో పాల్గొంటారని చెప్పారు. తాము రాయల తెలంగాణ ఒప్పుకునేది లేదన్నారు. పది జిల్లాల తెలంగాణనే కావాలన్నారు. అలా అయితేనే మద్దతిస్తామని సుష్మా స్వరాజ్ చెప్పారన్నారు. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణే కావాలన్నారు.
సుదీర్ఘ పోరాటం: మల్లేష్
తెలంగాణ ఉద్యమం సుదీర్ఘమైన పోరాటమని సిపిఐ ఎమ్మెల్యే గూండా మల్లేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తుది దశకు వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలది కడుపు కాలిన పోరాటమని, ఆంధ్రా ప్రాంత పోరాటం అప్రజాస్వామికం అన్నారు. నిధులు, నీళ్లు, పరిశ్రమలు కావాలని మాత్రమే ఇక్కడ పోరాటం చేస్తున్నామన్నారు. తెలంగాణను ఎవరు అడ్డుకోవద్దని కోరారు.