విశ్వవిద్యాలయ భూములపై కెసిఆర్పై కోదండరామ్ ధ్వజం
హైదరాబాద్: పేదల ఇళ్ల కోసం విశ్వవిద్యాలయాల భూములే తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ జెఎసి నాయకుడు కోదండరామ్ అన్నారు. విశ్వవిద్యాలయాల భూములను తీసుకోవాలనే కెసిఆర్ ఆలోచనను ఆయన వ్యతిరేకించారు. ‘ఓయూ భూములు కాపాడుకుందాం - భావి తరాల విద్యార్థులకు భవిష్యత్తు ఇద్దాం' అనే నినాదం, ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్తో ఆదివారం రాత్రి నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ నిర్వహించిన సభలో కోదండరాం ప్రసంగించారు.
విశ్వవిద్యాలయాల భూముల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడం మంచిదేనని, కానీ విశ్వవిద్యాలయ భూములను మాత్రం విద్యా సంబంధ, పరిశోధనలకు మాత్రమే వాడుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్కు, కమల్నాథన్ కమిటీకి ముడిపెట్టడంపై కూడా కోదండరాం అభ్యంతరం వ్యక్తం చేశారు.
కమలనాథన్ కమిటీ పరిధిలో లేని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని సూచించారు. ఉద్యోగాల భర్తీ ద్వారానే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ లోపు నోటిఫికేషన్లు వెలువడతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
గద్దెనెక్కక ముందు ఏడాదికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్ ఆ మాట మరిచిపోయారని, రెండు లక్షల ఖాళీలు ఉన్నా వాటి భర్తీకి చర్యలు తీసుకోకపోవడం లేదని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేయకుంటే ఎన్నికల నోటిఫికేషన్ కోసం పోరాడాల్సి ఉంటుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. దీనిపై ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు.
ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా నేటికీ ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం శోచనీయమని బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు విమర్శించారు. ఓయూ భూములపై కేసీఆర్కు ఏ విధమైన హక్కు కూడా లేదని, భూములను కాపాడుకునేందకు ఉద్యమాలు చేసే విద్యార్థులపై ప్రభుత్వం నాన్బెయిల్ కేసులు పెడుతోందని, విద్యార్థుల తరఫున తాము వాదిస్తామని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 1800 ఎకరాలతో ప్రారంభమైన ఓయూకు నేడు వెయ్యి ఎకరాలు మాత్రమే మిగిలిందని, ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే ఇక్కడ ఓయూ ఉండేదని చెప్పుకొనే పరిస్థితులు దాపురిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గతంలో హెచ్సీయూలో కొంత భూమిని కేసీఆర్ ఓ ఆసుపత్రికి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేశారని, అక్కడి విద్యార్థులు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గారని, పోరాట స్ఫూర్తి కలిగిన ఓయూ విద్యార్థులు ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుని తీరుతారని విశ్వేశ్వర్ రావు అన్నారు.