ఎన్నికల్లో పోటీకి కెసిఆర్ సీటు ఆఫర్: కోదండరామ్ నో
కోదండరాంతో పాటు టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం కెసిఆర్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. గంటకుపైగా సమావేశమయ్యారు. పార్టీలోకి ఆహ్వానించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కెసిఆర్ కోదండరామ్ను ఆహ్వానించారు. అయితే కోదండరాం ధన్యవాదాలు తెలిపి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అదే విషయాన్ని భేటీ తర్వాత కోదండరాం మీడియాకు వివరించారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో అందరం కలిసి పనిచేస్తామని, జెఎసిగా ముందుకు వెళతామని చెప్పారు. తెరాస తరఫున పోటీ చేస్తున్న శ్రీనివాస్గౌడ్కు మద్దతు ఇస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దానిపై ఇంకా ఆలోచించలేదని కోదండరాం బదులిచ్చారు. జెఎసి నుంచి రాజకీయాల్లోకి వెళ్లేవారు వెళ్లవచ్చని గతంలో నిర్ణయం తీసుకున్నామని, మిగిలిన వాళ్లం పునర్నిర్మాణం కోసం పనిచేస్తామని దేవీప్రసాద్ తెలిపారు.
ఎన్నికల్లో పోటీ చేయాలంటూ తెరాస నుంచి తనకు ఆహ్వానం అందిన మాట వాస్తవమేనని, అయితే ఇప్పట్లో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెసు పార్టీ కూడా తెలంగాణ జెఎసి నేతలను ఆహ్వానిస్తోంది. ఓ వైపు కాంగ్రెసు, మరో వైపు తెరాస తెలంగాణ జెఎసి నేతలకు టికెట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.