శంకర్ బాబు లైంగిక వేధింపులు, ఛైర్మన్ గౌరంబాబు అవినీతి నిజం కాదా?: సూర్యలత సంచలనం
విజయవాడ: బెజవాడ కనకదుర్గకు భక్తులు సమర్పించిన చీర దొంగిలించారనే ఆరోపణలతో సస్పెన్షన్కు దుర్గగుడి మాజీ పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత పాలక మండలిపై సంచలన ఆరోపణలు చేశారు. దుర్గగుడిలో ఓపీడీఎస్కు చెందిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
శంకర్ బాబు లైంగిక వేధింపులు నిజం కాదా?
విజయవాడలోని ప్రెస్క్లబ్లో శనివారం మీడియాతో సూర్యలత మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలక మండలి సభ్యుడు వెలగపూడి శంకర్ బాబు గుడిలో పనిచేసే మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. గతంలో ఐదుగురు బాధిత మహిళలు శంకర్ బాబుపై ఫిర్యాదు చేసినా.. పాలక మండలి ఛైర్మన్ గౌరంబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు.
ఫిర్యాదు చేసినా ఛైర్మన్ పట్టించుకోలేదు
ఫిర్యాదులను పట్టించుకోకపోవడమే కాకుండా శంకర్ బాబును గౌరంబాబు వెనకేసుకొచ్చేవాడని సూర్యలత మండిపడ్డారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్, ఘాట్ రోడ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. పాలకమండలి సభ్యురాలిగా అమ్మవారికి సేవ చేస్తున్న తనపై కొంతమంది కావాలని కుట్రలు పన్నారని ఆరోపించారు.
అవినీతిని ప్రశ్నిస్తే దొంగగా చిత్రీకరించారు
ఛైర్మన్ అక్రమాలను వ్యతిరేకించినందుకే తనపై కక్షకట్టారని సూర్యలత చెప్పారు. చీరల విషయంలో లక్షల అక్రమాలు జరిగాయని, వాటిని ప్రశ్నించినందుకే తనను చీరల దొంగగా చిత్రీకరించారని సూర్యలత ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు కూడా జరపకుండానే తనను తొలగించారని, తాను ఏ తప్పు చేయలేదని సూర్యలత స్పష్టం చేశారు.
ఎలాంటి విచారణకైనా సిద్ధం
అమ్మవారి ఆలయంలో అన్ని పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో సేవలన్నింటినీ కంప్యూటరీకరణ చేయాలనీ పాలకమండలికి తాను సూచించినట్లు చెప్పారు. ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై ఈవో దృష్టికి తీసుకెళ్లినందునే కొందరు తనపై కక్ష సాధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన నిజాయతీని నిరూపించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తానని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు.