'గుంటూరు' కోహినూర్ వజ్రం: శతాబ్దాల రక్తచరిత్ర, యజమాని ఎవరు?
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల్లో ఒకటైన కోహినూర్ వజ్రంపై రాజుకున్న వివాదాలకు భారత ప్రభుత్వం సోమవారం నాడు తెరదింపింది. వలస పాలన రోజుల్లో బ్రిటిషన్ పాలకులు దానిని భారత్ నుంచి అపహరించుకు వెళ్లారన్న వాదనను తిరస్కరించింది. అది కానుక అని చెప్పింది.
ఏళ్లుగా కోహినూర్ వజ్రం విషయమై చర్చ సాగుతోంది. కోహినూర్ వజ్రానికి పెద్ద చరిత్ర ఉంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా మన్ననలు అందుకున్న కోహినూర్ చుట్టూ మొదటి నుంచి చర్చ జరుగుతోంది. ఆ వజ్రం అసలు యజమాని ఎవరు అనేది ఇప్పటికీ స్పష్టంగా తేలలేదు.
'కానుకే': ఇక కోహినూర్ వజ్రం మనది కాదు!
14వ శతాబ్దంలో గుంటూరు సమీపంలోని కొల్లూరు గనిలో లభించిన ఈ వజ్రం గోలకొండ కోటకు చేరింది. ఆ తర్వాత అనేక చేతులు మారింది. కోహినూర్ అంటే పర్షియన్ భాషలో కాంతి శిఖరం అని అర్థం. 1849లో సిక్కు యుద్ధాల కాలంలో రాజా రంజిత్ సింగ్ వారసులు ఆ వజ్రాన్ని బ్రిటిష్ వారికి కానుకగా ఇచ్చారు.
భారత్లో తలదాచుకున్న ఓ ఆప్ఘన్ రాజు నుంచి రంజిత్ సింగ్ దానిని సొంతం చేసుకున్నాడు. అంతకుముందు అది పర్షియన్ రాజుల వారసత్వ సంపదగా ఉండేది. ప్రస్తుతం కోహినూర్ వజ్రం బ్రిటన్లో ఉంది. కోహినూర్ వజ్రానిది ఓ విధంగా రక్త చరిత్రగా చెప్పుకోవచ్చు.
గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లో 1,300 సంవత్సరానికి పూర్వం ఇది లభించిందని చెబుతారు. పురాణాల్లో చెప్పిన శమంతకమణి ఇదేనని కొందరి నమ్మకం. 1,300 సంవత్సరంలో మాల్వా రాజు మహాలక్ దేవ్ వద్ద ఉండగా, మాల్వా రాజును జయించిన అల్లా ఉద్దీన్, ధనరాశులన్నింటితో పాటు కోహినూర్ను సైతం తీసుకెళ్లాడంటారు.
మరికొందరి చరిత్రకారుల కథనాల ప్రకారం.. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి ఖజానాలో ఇది కొంత కాలం ఉంది. 1,310లో ఢిల్లీ సుల్తానుతో సంధి చేసుకున్న ఆయన.. ఈ వజ్రాన్ని సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ రాజుల వద్ద ఉన్న కోహినూర్... మొదటి పానిపట్టు యుద్ధం తరువాత బాబర్ చేతికి వెళ్లిందని అంటారు.
1,530న రాసిన బాబర్ నామాలో దీని ప్రస్తావన ఉంది. దీని విలువ ప్రపంచమంతా ఒకరోజు చేసే ఖర్చులో సగం ఉంటుందని బాబర్ నాడు తెలిపారు. పానిపట్టు యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోధి నుంచి బాబర్ దీనిని స్వాధీనం చేసుకున్నాడు. బాబర్ నుంచి షాజహాన్, ఔరంగజేబ్.. అక్కడి నుంచి సుల్తాన్ మహమ్మద్ వద్దకు చేరింది.
సుల్తాన్ మహమ్మద్ ఎప్పుడూ ఈ వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడన్న విషయాన్ని తెలుసుకున్న నాదిర్ షా ఆయనను విందుకు పిలిపించి, తలపాగాలు మార్చుకుందామన్న ప్రతిపాదన పెట్టాడు. తప్పనిసరి పరిస్థితుల్లో సుల్తాన్ మహమ్మద్ తలపాగాతో పాటు వజ్రాన్ని నాదిర్ షాకు ఇచ్చాడు.
వజ్రాన్ని చూసిన నాదిర్ షా దానిని కోహినూర్ అన్నాడని చెబుతారు. ఇది 1739 సమయంలో జరిగింది. ఆపై వజ్రం పలు చేతులు మారుతూ పంజాబ్ పాలకుల వద్దకు చేరింది. 1849లో జరిగిన సిక్కు యుధ్ధంలో ఓటమి పాలైన మహరాజా రంజిత్ సింగ్ దీనిని ఈస్ట్ ఇండియా కంపెనీకి సమర్పించుకున్నారు.
అనంతరం ఇది బ్రిటన్ రాణి విక్టోరియా వద్దకు వెళ్లింది. ఆ తర్వాత వజ్రానికి సాన బట్టించిన రాణి తన కిరీటంలో పొదిగించుకుంది. విక్టోరియా తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్ రాణులు దీనిని ధరించారు. బ్రిటన్ రాజ కుటుంబంలో పెద్ద కోడలికి ఈ వజ్రం కానుకగా ఇస్తుంటారు.
ఈ వజ్రం పురుషుల వద్ద ఉంటే వారు నష్టపోయారని, మహిళల వద్ద ఉంటే వారిని అదృష్టం వరించిందని చరిత్ర చెబుతోంది. దీన్ని తిరిగి ఇవ్వాలని 1947లో ఒకసారి, 1953లో మరోసారి భారత్ కోరినా బ్రిటన్ స్పందించలేదు. ఆపై 2000 సంవత్సరంలో పలువురు ఎంపీలు వజ్రం కోసం క్లెయిమ్ చేశారు.
బ్రిటన్ అధికారులు దీన్ని తిరిగిచ్చేది లేదన్నారు. వాస్తవానికి ఈ వజ్రం అసలు యజమాని భారత్ అని ఇప్పటికీ చెప్పుకోలేని పరిస్థితి. అవిభాజ్య భారతావని నుంచి తరలివెళ్లిన కోహినూర్.. ఒకవేళ తిరిగి భారత్ చేరితో, దీనిలో భాగం ఇవ్వాలని పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ దేశాల నుంచి డిమాండ్లు వచ్చాయి.
ప్రస్తుతం ఇది బ్రిటన్ మ్యూజియంలో వేలాది అపురూప కళాఖండాలు, విలువైన వజ్రాల మధ్య ఇప్పటికీ చూపరులను ఆకర్షిస్తోంది. తాము వివిధ దేశాల నుంచి తెచ్చిన విలువైన వస్తువులను తిరిగి ఆ దేశాలకే ఇచ్చేస్తే, తమ మ్యూజియంలో ఒక్క వస్తువు కూడా ఉండదన్నది బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమెరాన్ వాదన.
నాలుగైదు శతాబ్దాలు గడుస్తున్నప్పటికీ.. కోహినూర్ వజ్రం విషయంలో భారత్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బ్రిటన్ తదితర దేశాలు తామే యజమానులుగా చెప్పుకుంటున్నాయి. అయితే, భారత్ ప్రభుత్వం తాజాగా దానిని కానుకగా ఇచ్చినట్లు చెప్పింది.