అసమర్థ నాయకుడు: జగన్పై కొల్లు రవీంద్ర, ‘తోటలను తగలబెట్టింది జగన్ పార్టీ నేతలే’
కృష్ణా: ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థుడిగా వ్యవహరిస్తున్నారని ఏపి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. మంగళవారం సాయంత్రం కృష్ణా జిల్లా నందిగామ మండలంలో అంబాదుపేటలోని బోదానంద ఆశ్రమంలో నిర్వహించిన యాగంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపి రాజధానిని ప్రపంచానికి ఆదర్శంగా నిర్మిస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ మాత్రం ఆహ్వానించినా రాకపోవడం విడ్డూరమన్నారు.
చెరకు తోటలను జగన్ పార్టీ నేతలే తగులబెట్టారు: అనురాధ
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురంలో చెరకు తోటలు తగులబడిన విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. చెరకు తోటను జగన్ పార్టీ నేతలే తగులబెట్టారని ఆమె ఆరోపించారు.
చెరకు తోటను వారే తగులబెట్టి, తిరిగి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె విమర్శించారు. శంకుస్థాపనకు వచ్చిన ప్రజల మద్దతు చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
విజిలెన్స్ దాడులను ముమ్మరం: పరిటాల సునీత
కందిపప్పు అక్రమంగా నిల్వ ఉంచిన గోదాములపై విజిలెన్స్ దాడులను ముమ్మరం చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. మంగళవారం పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిత్యావసరాల ధరల తగ్గింపునకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. త్వరలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా రేషన్ కార్డులపై రూ.50కే సబ్సిడీ కందిపప్పు పంపిణీ చేస్తామన్నారు.
అక్రమంగా నిల్వ చేసే వ్యాపారులపై చర్యలు తప్పవని సునీత హెచ్చరించారు. రేషన్కార్డుల కోసం 22 లక్షల దరఖాస్తులు వచ్చాయని, అర్హులకు త్వరలో కార్డులు ఇస్తామని తెలిపారు.