కేసీఆర్పై కోమటిరెడ్డి రివర్స్, చీలిక భయం: నారాయణ
హైదరాబాద్/కరీంనగర్: తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ్యుడు కోమటిరెడ్డి యూ టర్న్ తీసుకున్నారు! తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అద్భుతంగా పని చేస్తున్నారని తాను ఎప్పుడు చెప్పలేదని అన్నారు. తాను పార్టీ మారాల్సి వస్తే రాజీనామా చేశాక మారుతానని చెప్పారు. బీబీ నగర్ నిమ్స్కు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు.
తెలంగాణలో కరెంట్ సమస్యలకు కేసీఆర్ అశ్రద్ధనే కారణమని చెప్పారు. తాను కాంగ్రెస్ నుండి తెరాసలోకి వెళ్లాలనుకుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వెళ్తానన్నారు. కాంగ్రెస్ హయాంలోనే కరెంట్ విషయంలో శంకర్ పల్లి, నేదునూయ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయించలేదనే వాస్తవాన్ని తాను చెప్పినట్టి కోమటిరెడ్డి గుర్తు చేశారు. కాగా, కొద్ది రోజుల క్రితం కోమటిరెడ్డి మాట్లాడుతూ.. అప్పుడే కేసీఆర్ పైన విమర్శలు సరికాదని, కొంత టైం ఇవ్వాలని వ్యాఖ్యానించారు.
దళితుడికి సీఎం పదవి ఇవ్వకుంటే తల నరుక్కుంటా అన్నట్లుగా ఉంది: గీతా రెడ్డి
నాలుగు ఏళ్ల తర్వాత ఇంటింటికి నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని కేసీఆర్ చెప్పడం విడ్డూరమని, ఆయన తీరు తాము అధికారంలోకి వచ్చాక దళితుడికి సీఎం పదవి ఇవ్వకుంటే తల నరుక్కుంటా అని చెప్పినట్లుగా ఉందని మాజీ మంత్రి గీతా రెడ్డి ఎద్దేవా చేశారు. కల్యాణ్ లక్ష్మీ అన్న కేసీఆర్.. ఒక్కో పెళ్లికి మూడువేల రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నారు.
కొండను తవ్వి ఎలుకను తీసినట్లుగా: జీవన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కొండను తవ్వి ఎలుకను తీసినట్లుగా ఉందని కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు జీవన్ రెడ్డి అన్నారు.
దగా, మోసం: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దగా, మోసం అని రేవంత్ రెడ్డి అన్నారు. బడ్జెట్కు సవరణలు ప్రతిపాదిస్తామన్నారు. ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యల పైన దృష్టి పెట్టలేదన్నారు. కేటీఆర్, హరీష్ రావుల శాఖలకే భారీగా నిధులు కేటాయించారన్నారు.
ఆదుకునేదెవరు: ఎర్రబెల్లి
అమరుల కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ఎర్రబెల్లి దయాకర రావు ప్రశ్నించారు. తెరాస బడ్జెట్ దగాగా ఉందన్నారు. వ్యవసాయనికి పెద్ద పీట వేయలేదన్నారు.
కార్పోరేట్, కాంట్రాక్టర్లకు లబ్ది: ఆర్ కృష్ణయ్య
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కార్పోరేట్, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేదిలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. కేజీ టు పీజీ విద్యకు సరైన నిధులు కేటాయించలేదన్నారు. పేదలకు ఇళ్ల విషయంలో మాయమాటలు చెప్పారన్నారు.
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా: కేసీఆర్
అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ పైన కేసీఆర్ స్పందించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా బడ్జెట్ ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి, టీఆర్ఎస్ ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోకు అనుగుణంగానే బడ్జెట్ ఉందన్నారు. అన్ని పథకాలకు బడ్జెట్లో సముచిత స్థానం లభించిందని చెప్పారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా అన్ని శాఖలు పురోగమించాలని, శాఖల వారీగా కార్యాచరణ రూపొందించుకుని ప్రజల భాగస్వామ్యంతో బడ్జెట్ లక్ష్యాలు సాధించాలన్నారు.
బాబు, కేసీఆర్ ఒకే తాను ముక్కలు: నారాయణ
వలసలను ప్రోత్సహించడంతో కేసీఆర్, చంద్రబాబులు ఒకే తాను ముక్కలు అని సీపీఐ నేత నారాయణ కరీంనగర్ జిల్లాలో అన్నారు. కేసీఆర్ రాజకీయ అభద్రతా భావంలో ఉన్నారన్నారు. పార్టీలో చీలుకలు వస్తాయనే అనుమానం ఆయనలో ఉందన్నారు. రానున్న రోజుల్లో బూర్జువా పార్టీలతో కాకుండా వామపక్షాలతో కలిసి ఉద్యమిస్తామన్నారు.