కోనసీమ ఆందోళనల్లో రౌడీషీటర్లు, టీడీపీ, జనసేనల పాత్ర ఉంది: మంత్రులు విశ్వరూప్, కొట్టు
అమరావతి: కోనసీమలో చోటు చేసుకున్న ఆందోళనలపై ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ తాజాగా స్పందించారు. కోనసీమ ప్రాంతంలో గత 50 ఏళ్లలో ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. అమలాపురంలో మంగళవారం జరిగిన ఆందోళన విధ్వంసానికి దారితీయడం, మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టడంతో తీవ్ర ఉద్రిక్తతకు తావిచ్చిన విషయం తెలిసిందే.
కోనసీమ ఆందోళనల్లో రౌడీషీటర్లు, విద్రోహశక్తులు: విశ్వరూప్
ఈ నేపథ్యంలో ఆందోళనకారులు తగలబెట్టిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమలాపురం ప్రజానీకం ఎప్పుడూ తప్పుడు ఆలోచనతో లేరని, మంగళవారం జరిగిన ఘటనలకు కొనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలన్నారు. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనలో కొన్ని సంఘ విద్రోహశక్తులు, కొంతమంది రౌడీషీటర్లు చేరి దశ, దిశ లేని ఉద్యమాన్ని పక్కదోవ పట్టించారన్నారు.
దాడి ఘటనల వెనుక టీడీపీ, జనసేనలు: విశ్వరూప్
తన ఇంటితోపాటు ఎమ్మెల్యే సతీష్ ఇంటిని కూడా తగలబెట్టారని మంత్రి విశ్వరూప్ తెలిపారు. గమ్యం లేని ఉద్యమాన్ని తమ ఇళ్ల వైపు మళ్లించారన్నారు. అక్కడికి సమీపంలోనే ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఇంటిపై ఎందుకు దాడి చేయలేదు? అమలాపురంలో జరిగిన ఘటనల వెనుక టీడీపీ, జనసే ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారని మంత్రి విశ్వరూప్ ఆరోపించారు. ప్రభుత్వం ముందు కోనసీమ అనే నామకరం చేసిందని.. జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ అంబేద్కర్ పేరు పెట్టాలని కోరాయన్నారు మంత్రి విశ్వరూప్. ఎవరూ రోడ్లపైకి రావొద్దని, సయమనం పాటించాలని కోనసీమ దళిత సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రౌడీషీటర్ల ఉచ్చులో పడొద్దని మంత్రి విశ్వరూప్ కోరారు.
జనసేన, టీడీపీ కుట్రలో భాగమేనంటూ కొట్టు సత్యనారాయణ
మరోవైపు, మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా కోనసీమలో అల్లర్లకు టీడీపీ, జనసేనలను బాధ్యులను చేస్తూ ఆరోపణలు చేశారు. జనసేన, టీడీపీ కుట్రలో భాగంగానే కోనసీమలో అల్లర్లు జరిగాయన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఏపీలో శ్రీలంక లాంటి పరిస్థితి వస్తుందని చెప్పినప్పుడే అర్థమైందన్నారు. రాజకీయ లబ్ది కోసమే కోనసీమలో చంద్రబాబు అల్లర్లు చేయిస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రాంతాన్ని ఎంచుకుని కుట్రలో భాగంగానే దాడులు చేశారని మండిపడ్డారు. ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.అందరి అభిప్రాయాలతోనే అంబేద్కర్ పేరును జిల్లాకు పెట్టామన్నారు. టీడీపీ, జనసేనలు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కోరాయని మంత్రి కొట్టు చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు మనుగడ కోసమే ప్రజలను రెచ్చగొడుతన్నాయని మంత్రి కొట్టు ఆరోపించారు.